ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గతంలో అధికారంలో ఉన్నపుడు తీసుకున్న నిర్ణయాలు, అప్పటి వ్యవహారాలపై ఇప్పుడు కేసులు న‌మోదవుతున్నాయి. ఒక కేసు ముగియకముందే మరో కేసు నమోదవడం, ఓ కేసులో రిలీఫ్ దక్కుతుందనుకుంటే మరో కోణంలో చర్యలు మొదలవడం వల్ల వైసీపీ నేతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఈ పరిణామాలు పార్టీని బాగా డిఫెన్స్‌లో ప‌డేస్తున్నాయి. గతంలో టీడీపీ హయాంలో వైసీపీకి ఎదురైన అరెస్టులు, కేసులు రాజకీయంగా పెద్ద హిట్ అయ్యాయి. ఆ అరెస్టుల కారణంగా సంబంధిత నియోజకవర్గాల్లో కార్య‌క‌ర్త‌లు, కేడర్ ఉత్సాహంగా స్పందించి క‌సి తో ప‌నిచేసి .. తమ నేతల‌కు విజయాలు అందించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ వంటి నేతలు ఎన్నికల్లో గెలిచిన దానికి ప్రధాన కారణం ఆ అణచివేతలపై వచ్చిన సింప‌తీ, కార్యకర్తల మధ్య పెరిగిన క‌సి అన్న విషయం వాస్తవమే.


ఇప్పుడు అదే తరహాలో వైసీపీ కూడా ప్రజల్లో సింపతీ కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. తాజా అరెస్టులను అవకాశంగా మార్చుకోవాలన్న వ్యూహంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. నాయ‌కులతో సమావేశమై, కేసులపై ప్రజల మధ్య చర్చ పెంచేందుకు, అవి రాజ‌కీయ ప్రేరణతో చేసినవే అనే వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేశారు. జగన్ లెక్క‌ ప్రకారం, ఈ అరెస్టులు పార్టీ కేడర్‌ను చైతన్యవంతం చేసి తిరిగి రంగంలోకి తెచ్చేలా చేయాలని ఆశిస్తున్నారు. ప్రజలకు తాము ఎదుర్కొంటున్న కేసులు కూట‌మి ప్ర‌భుత్వ క‌క్షాపూరిత రాజ‌కీయాల్లో భాగంగా జరుగుతున్నాయన్న ఫీల్ ప్ర‌జ‌ల్లో కలిగించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో నేతలపై కేసులు నమోదు కావడంతో అక్కడ కాసింత ఊపు కనిపిస్తోంది. కాని అది నిజంగా క‌సిగా మారుతుందా? అంటే, సందేహమే.


గతంలో టీడీపీకి పనిచేసిన ఈ వ్యూహం వైసీపీకి ఉపయోగపడుతుందా ? అనేది సందేహాస్పదంగా మారుతోంది. ఎందుకంటే, ప్రస్తుతం ప్రజల్లో కేసులపై రెండు చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇది రాజ‌కీయ క‌క్ష అనే వారు ఉన్నారు. అలాగే మ‌రోవైపు తప్పు చేశారనే అరెస్టు అయ్యారు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ రెండింటి మధ్య వైసీపీ సింప‌తీ గెయిన్ చేయగలదా ? అనే ప్రశ్న రాజకీయంగా కీలకం. ఈ కేసుల ద్వారా వైసీపీకి కలిగే నష్టానికి మించి లాభం ఉందా ? అనేది చూడాలి. ఎందుకంటే, గత ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కేడర్ లో  నిరాశ ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ కేడర్ మళ్లీ కసిగా మారాలంటే కేవలం అరెస్టులు చాలవు. నాయకత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకత్వం, గ్రౌండ్ లెవెల్‌కి నమ్మకాన్ని కలిగించే కార్యకలాపాలు అవసరం. ఏదేమైనా వైసీపీ క‌సి ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో ?  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: