ఇది డిజిటల్ యుగం.. సెల్ ఫోన్ చెంత లేకపోతే క్షణం గడవని రోజులు వచ్చేశాయి. అందుకే ఇప్పుడు ఏ ఆవిష్కరణ అయినా సెల్ ఫోన్ కేంద్రంగానేసాగుతున్నాయి. ఇంత టెక్నాలజీ వచ్చినా ఇంకా ఎన్నో ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఇవి ఇబ్బందులు అనుకుంటే ఇబ్బందులే.
కానీ ఆ ఇబ్బందుల్లోనే ఆవిష్కరణలుగా మలచుకుంటున్నారు కొందరు ఔత్సాహికులు. మనం చెప్పుకోబోయే.. ఈ 18 ఏళ్ల కుర్రాడు అలాంటి వాడే. ఉదయం లేవగానే పేపర్ ముఖం చూడందే రోజు ప్రారంభం కాదు.. చాలా మందికి.. అయితే చాలా పత్రికలకు లిమిటేషన్స్ ఉన్నాయి.
కొన్ని రాజకీయాలకు ఇంపార్టెన్స్ ఇస్తాయి. మరికొన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తలు ఇస్తాయి. ఇక బిజినెస్ కోసం మరికొన్ని పత్రికలు. కానీ ఇవన్నీ కొని చదవడం సాధ్యం కాదు కదా. ఈ ఇబ్బందినే అవకాశం మలచుకున్నాడు వెంకట కార్తీక్ రాజా అనే 18 ఏళ్ల కుర్రాడు.
అన్ని పత్రికలు డిజిటల్ రూపంలో ఫోన్లోనే దొరికితే ఎంత బావుంటుంది.. ఇలా ఆలోచించిన కార్తీక్ రాజా.. అద్భుతమైన పేపర్ యాప్ రూపకల్పనకు దారి తీసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 400కు పైగా దిన, వార పత్రికలను ఈ పేపర్ యాప్ అందిస్తోంది. ఒకే ఒక మొబైల్ యాప్ వందలాది న్యూస్ పేపర్లను దినపత్రికలను చదువుకునే అవకాశం కల్పించింది.
అసలు ఈ ఐడియా పాఠశాల రోజుల్లోనే వచ్చిందట కార్తీక్కు. కాస్త పెద్దయ్యాక ఇంప్లిమెంట్ చేయడం ప్రారంబించాడు. అతని ఆలోచనకు తల్లిదండ్రులు పూర్తి మద్దతుగా నిలిచారు. ఇద్దరితో ప్రారంభమైన ఇతని టీమ్ ఇప్పుడు యాభై మందికి చేరిందట.
ఇప్పుడు ఇతని యాప్ లో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ దినపత్రికలు సహా అనేక మేగజైన్లు లభిస్తాయి. ఐఓస్, యాండ్రాయిడ్ వెర్షన్ లో అందుబాటులో వున్న ఈ యాప్ లో ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ కార్తీక్..