తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తో దాదాపు పది సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. వివివినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించి ఈ చిత్రంలో రైతులకు అద్భుతమైన మెసేజ్ ఉండటం..అందులోనూ మాస్ ఎలిమెంట్స్, పాటలు, ఫైట్స్ అన్నీ కలగలిపి ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు చిరంజీవి.
ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా..రాంచరణ్ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. తాజాగా ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ జన్మదినోత్సవం ఈ టీజర్ ఒకరోజు ముందే రిలీజ్ చేస్తున్నారు. రామ్చరణ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే టీజర్ సిద్ధమైనట్టు ఈ సినిమా సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ట్విటర్ ద్వారా వెల్లడించారు. `ఇంత గొప్ప చిత్రంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది.
`సైరా` టీజర్కు నేపథ్య సంగీతం సమకూర్చే పని పూర్తయింది. మీ స్పందన కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాన`ని అమిత్ ట్వీట్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి ఈ చిత్రం పది సంవత్సరాల క్రితమే చేయాలనుకున్నా..అప్పట్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తో చిత్రాన్ని అలా పక్కన పెట్టారు.
ఇప్పుడు చిరు రీఎంట్రీ ఇవ్వడంతో ఆ చిత్రం ఖచ్చితంగా చేయాలని నిర్ణయంతో తీస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కాగా, చిత్రంలో అతి కష్టమైన భారీ సన్నివేశాలన్నీ పూర్తయ్యాయట. ఇక మిగతా సన్నివేశాల్ని వేగంగా షూట్ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్రణాళికలో చిత్ర బృందం ఉంది.