రామ్ పోతినేని,పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” వారిద్దరికి అరుదైన విజయం అందించింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న దర్శకుడు పూరి కెరీర్కు ఇస్మార్ట్ శంకర్ పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఆరు వరుస ప్లాపుల తర్వాత హిట్ అంటే మామూలు విషయం కాదు. పూరి ఫుల్ స్వింగ్లోకి వచ్చాడని చెప్పకపోయినా ఓ మోస్తరు ఫామ్లోకి వచ్చాడు.
ఇక అటు ప్లాపుల మీద ప్లాపుల్లో ఉన్న రామ్ కూడా కాస్త ట్రాక్లోకి ఎక్కాడు. రూ.75 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసి రూ.35 కోట్ల షేర్ దాటేసినా ఇస్మార్ట్ రామ్ కెరీర్లోనే మంచి హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ ఇస్మార్ట్ శంకర్ మూవీని చిత్రం బృందంతో కలిసి చూశారని సమాచారం.
ఈ మూవీ మహేష్ ని బాగా ఆకట్టుకోవడంతో దర్శకుడు పూరి, హీరో రామ్ అలాగే చిత్రంలో హీరోయిన్స్ గా నటించిన నిధి అగర్వాల్,నభా నటేష్ లపై ప్రశంసలు కురిపించారట. అయితే ఇక్కడే అసలు కథ ఉంది. కొద్ది రోజుల క్రితం ఇస్మార్ట్ హిట్ను ఎంజాయ్ చేస్తూ పూరి మహేష్బాబుపై సెటైరికల్గా మాట్లాడాడు.
“మహేష్ నేను విజయాలలో ఉన్నప్పుడు తప్పా, ప్లాప్స్ లో ఉన్నప్పుడు పట్టించుకోరు” అని, కొంచెం ఘాటు విమర్శలే చేశారు. బిజినెస్మేన్ హిట్ తర్వాత పూరి మహేష్ కోసం జనగణమణ స్టోరీ రాసుకుని మహేష్తోనే ఈ సినిమా చేస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత పూరికి వరుస ప్లాపులు రావడంతో పట్టించుకోలేదన్నదే పూరి ఆవేదన.
ఇక ఇప్పుడు హిట్ కొట్టారుగా మహేష్తో మళ్లీ చేస్తారా ? అనగానే నాకు ఓ క్యారెక్టర్ ఉంటుందిగా అని చెప్పాడు. అయితే పూరి ఈ విషయాన్ని అంత ఓపెన్గా చెప్పడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ బయటకు స్పష్టంగా రివీల్ అయ్యింది. అయితే ఇప్పుడు మహేష్ అవేమి పట్టించుకోకుండా ఇస్మార్ట్ శంకర్ టీం పై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. మహేష్ చాలా తెలివిగా కౌంటర్ ఇచ్చాడని చాలా మంది ప్రశంసిస్తున్నారు.