నిన్న విజయవాడ దగ్గరఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఒక సంఘటన పవన్ ‘అత్తారింటికి దారేది’ సీన్ రిపీట్ చేసింది అంటూ చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు. దీనికి కారణం నిన్న విజయవాడకు తన ‘జనసేన’ కార్యాలయం అద్దె భవనానికి గృహప్రవేశం నిమిత్తం వచ్చిన పవన్ కు ఎయిర్ పోర్ట్ లో జరిగిన రాచ మర్యాదలు.
నిన్న వైజాగ్ నుండి ఒక ప్రత్యేక విమానం విజయవాడకు వచ్చింది. ఆ విమానంలో వచ్చే వ్యక్తికోసం నేవీ బ్లూ కలర్ లో ఉన్న అత్యంత విలాస వంతమైన బి.ఎమ్.డబ్ల్యూ-7 సిరీస్ కారు ఎయిర్ పోర్ట్ లో విఐపి ల కోసం వేచి ఉండే ప్రాంగణంలో పార్క్ చేయబడి ఉంది. ఆ ప్రత్యేక విమానం విజయవాడ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే ఆవిమానంలోంచి పవన్ కళ్యాణ్ అతడి భార్య అన్న బయటకు వచ్చారు.
పవన్ ను చూడగానే ఎయిర్ పోర్ట్ లో కలకలం ఏర్పడటంతో సుమారు 20 బౌన్సర్లు పవన్ ను చుట్టుముట్టి పవన్ కు అభిమానుల నుండి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ వంతు ప్రయత్నాలు చేసారు. ఎయిర్ పోర్ట్ లో ఈ సీన్ చూసిన చాలామందికి ‘అత్తారింటికి దారేది’ లోని సీన్ గుర్తుకు వచ్చి ‘జనసేన’ రాజకీయ సినిమాలో పవన్ ‘అత్తారింటి’ సీన్ అంటూ కామెంట్ చేసుకోవడం వినిపించింది.
పవన్ కు ఈ రాచమర్యాదలు అందించింది ఎవరూ అన్న విషయమై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఒక ప్రముఖ రాజకీయ పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ప్రస్తుతం ఒక ప్రవేట్ ఎయిర్ లైన్స్ సంస్థను నిర్వహిస్తున్న కమ్మ సామాజిక వర్గంలోని ఒక ప్రముఖ వ్యక్తి ఈ హడావిడి అంతా ఏర్పాటు చేసాడనీ రాబోతున్న ఎన్నికలలో ‘జనసేన’ పార్టీ తరపున పార్లమెంట్ కు పోటీ చేసే ఉద్దేశ్యంలో ఉన్న ఆప్రముఖ వ్యక్తి పవన్ అనుగ్రహం కోసం ఈఏర్పాట్లు చేసాడని అంటున్నారు. ఏమైనా నిన్నటిరోజున విజయవాడ ఎయిర్ పోర్ట్ లో జనానికి పవన్ మళ్ళీ ఒక సినిమా సీన్ చూపెట్టి కొద్దిసేపు ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాదనుకోవాలి..