తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌ పార్టీ,  భార‌తీయ జ‌న‌తా పార్టీల మ‌ధ్య త‌రుచూ ఏదో ఓ సంద‌ర్భంలో వివాదాలు త‌లెత్తుతున్న విష‌యం విధిత‌మే. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ స‌మ‌స్య ఉంద‌ని తాజాగా ఈ  ఘ‌ట‌న‌తో వెల్ల‌డైంది. జోగులాంబ గద్వాల జిల్లా  కేంద్రంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయ‌కుని చెంప చెళ్లుమ‌నిపించింది ఓ మ‌హిళా కౌన్సిల‌ర్‌.

వివ‌రాల్లోకి వెళ్లితే.. గ‌ద్వాల మున్సిపాలిటీ ప‌రిధిలో ఆయా వార్డుల‌కు  క‌ల్యాణ‌ల‌క్ష్మీ, షాదీముబార‌క్  సంబంధించి మంజూరైన చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మం గురువారం నిర్వ‌హించారు. ముఖ్యంగా వార్డులో స్థానిక నేత‌ల‌తో పాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, మున్సిప‌ల్ చైర్మ‌న్ కేశవ్ చెక్కుల‌ను పంపిణీ చేసారు. ఈ కార్య‌క్ర‌మానికి స్థానిక కౌన్సిల‌ర్ జ‌య‌శ్రీ‌, అధికార పార్టీ యువ నాయ‌కుడు, జ‌ముల‌మ్మ దేవాల‌య క‌మిటీ డైరెక్ట‌ర్ రాము త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

రాజ‌కీయ విభేదాలు ఉన్న నేప‌థ్యంలో.. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే అర్హ‌త ఎక్క‌డిది..? అత‌ను ఉంటే నేను స‌భ‌లో పాల్గొన‌ను అని కౌన్సిల‌ర్ జ‌యశ్రీ  ప‌క్క‌కు త‌ప్పుకున్న‌ది. దీంతో ఎమ్మెల్యే న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసినా.. ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేసి వెళ్లిపోయిన త‌రువాత అధికార పార్టీ యువ‌నాయ‌కుడిపై మ‌హిళా కౌన్సిల‌ర్ తిట్ల‌దండక‌మందుకున్నారు.మాట మాట పెర‌గ‌డంతో  లాగి యువ నాయ‌కుని చెంప‌చెళ్లు మ‌నిపించింది మ‌హిళా కౌన్సిల‌ర్‌.

ఊహించ‌ని విధంగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు అక్క‌డ ఉన్న‌వారంద‌రూ బిత్త‌ర‌పోయారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల మ‌ధ్య కొద్ది సేపు ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.అయితే ఒకే వార్డుకు చెందిన ఇరువురు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు కావ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. బాధితుడు రాము స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు కూడా చేసాడు.  ఈ ఘ‌ట‌న ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చ‌ర్చ మొద‌లైంది.  మ‌హిళా కౌన్సిల‌ర్ టీఆర్ఎస్ నేత‌ను చెంప‌దెబ్బ కొట్టిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతొంది.





మరింత సమాచారం తెలుసుకోండి: