జనాల ఆలోచనా విధానాలు కూడా విచిత్రంగా మారిపోతున్నాయి. ఎన్నికలన్నాక పార్టీల అధినేతలు అనేక హామీలిస్తుంటారు. హామీల్లో కూడా మళ్ళీ రెండు రకాలుంటాయి. మొదటిది ఆచరణ సాధ్యమయ్యేవి. అంటే రాష్ట్రప్రభుత్వ పరిధిలోనివి. ఇక రెండో రకం కేంద్రపరిధిలోనివి. మొదటిరకం హామీ అమలు పూర్తిగా అధికార పార్టీ పరిధిలోనివే కాబట్టి అమలు చేయటం పెద్ద కష్టం కాదు. సమస్యంతా రెండో రకమైన హామీల్లోనే ఉంది.
తప్పుడు హమీల ఫలితాలు
రెండో రకమైన హామీ అంటే కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశానికి ప్రాంతీయ పార్టీ అధినేత హామీ ఇవ్వటం తగదు. ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ ఇచ్చిన హామీని కేంద్రంలోని ప్రభుత్వం అమలు చేయవచ్చు, చేయలేకపోవచ్చు. అందునా రాజ్యాంగ సవరణ చేయాల్సున్న అంశాలపై నేతలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ చంద్రబాబునాయుడు అటువంటి జాగ్రత్తలేమీ తీసుకోలేదు. పోయిన ఎన్నికల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా కాపులను బిసిల్లోకి చేరుస్తాననే ఆచరణ సాధ్యంకానీ హామీనిచ్చేశారు.
తప్పుడు హామీనే నమ్మిన నేతలు
తన హామీ అమలు సాధ్యం కాదని తెలిసీ చంద్రబాబు ఇచ్చారు. విచిత్రమేమిటంటే ఆ హామీనే కాపు సామాజికవర్గంలోని నేతలు, జనాలు కూడా నమ్మారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళే కాకుండా న్యాయ, రాజకీయ రంగాల్లో అనుభవం ఉన్న వాళ్ళు కూడా హామీని నమ్మి చంద్రబాబుకు మద్దతు పలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిందేమింటో అందరికీ తెలిసిందే. అందుకే తాను అటువంటి తప్పుడు హామీని ఇవ్వలేనంటూ జగన్ ప్రకటించారు.
నిజం చెబితే మండిపడుతున్నారు
నిజానికి వాస్తవాన్ని బహిరంగసభలో చెప్పిన జగన్ ను అభినందించాలి. టిడిపి, టిడిపికి మద్దతుగా నిలబడుతున్న మీడియా ఎటూ జగన్ ను తప్పుపడుతుందనటంలో సందేహం లేదు. కానీ ముద్రగడ లాంటి అనుభవజ్ఞులు కూడా జగన్నే తప్పుపడుతున్నారు. చూడబోతే ముద్రగడ మాటలు ఎలాగున్నాయంటే చంద్రబాబు ఇచ్చినట్లుగానే జగన్ కూడా తప్పుడు హామీ ఇవ్వాలన్నట్లుంది.
ఎన్నికలపై ప్రభావం ఎంతో ?
జగన్ చేసిన ప్రకటనలోని వాస్తవాన్ని కాపులు లేదా బిసి సామాజికవర్గంలోని జనాలు ఏ విధంగా స్పందిస్తారనే విషయంపై ఇప్పటికైలే క్లారిటీ లేదు. రాజకీయ పార్టీల్లోని నేతలెటూ తమ పార్టీ విధానాల ప్రకారమే మాట్లాడుతారు కాబట్టి వారిని పట్టించుకోనవసరం లేదు. అదే సమయంలో కాపులను బిసిల్లో కలపటమనే సమస్య పై రెండు సామాజికవర్గాలకు మాత్రమే సంబంధించింది కాబట్టి మిగిలిన సామాజికవర్గాలపై ఆ సమస్య ప్రభావం ఉండదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే కాపులను తమలో కలపటాన్ని బిసిలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో జగన్ చెప్పిన నిజం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సిందే.