వినటానికి విచిత్రంగా ఉన్నా జరుగుతున్నదదే. ఈరోజు కర్నూలులో చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్నూలు లో జరిగే ధర్మపోరాట సభలో పాల్గొంటున్నారు. సిఎ వస్తున్నారు కాబట్టి పాఠశలలను తొందరగా మూసేయాలంటూ అధికారులు స్కూళ్ళ యాజమాన్యాలను ఆదేశించారు. అంటే ఉదయం 10.30 గంటలకంతా స్కూళ్ళని మూసేయాలని డైరెక్షన్ వచ్చింది. దాంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని అన్నీ స్కూళ్ళకి ఈరోజు సెలవులిచ్చేశారు.
సిఎం సభలంటే స్కూళ్ళకు సెలవే
ముఖ్యమంత్రి పర్యటిస్తున్న ప్రాంతాల్లో పాఠశాలలను మూసేయించటం ఇదే తొలిసారి కాదు. మొన్న చీరాలలోను అంతకుముందు ఒంగోలు పర్యటనలో కూడా స్కూళ్ళని మూయించేశారు. ఇంతకీ ఎందుకలా జరుగుతోంది ? అంటే, చంద్రబాబు పాల్డొనే సభలకు ఎక్కడా జనాలు రావటం లేదు. జనాలు కావాలంటే ఎక్కడోక్కడి నుండి తరలించుకురావాలి. తరలించాలంటే వాహనాలు కావాలి. అందుకే టిడిపి నేతలు స్కూళ్ళ మీద పడ్డారు. ఇపుడు దాదాపు ప్రతీ స్కూలుకు బస్సులుంటున్నాయి కదా ? అందుకే స్కూళ్ళు మూయించి ఆ బస్సులను తీసేసుకుని చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఆ బస్సుల్లో జనాలను తరలిస్తున్నారు. స్కూళ్ళ బస్సులు కావాలంటే మామూలు రోజుల్లో సాధ్యం కాదు కాబట్టి బలవంతంగా మూయించేస్తున్నారు. ఇపుడు కర్నూలులో జరిగిందదే.
విద్యార్ధి నేతల అరెస్టులు
పనిలో పనిగా ధర్మపోరాట దీక్షలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఏబివిపి నేతలను ముందు జాగ్రత్తగా అరెస్టులు చేయించేశారు. అంటే చంద్రబాబు చేస్తున్న పోరాటం కేంద్రానికి వ్యతిరేకంగా కాబట్టి బిజెపి విద్యార్ది విభాగమైన ఏబివిపి, వైఎస్సార్ విద్యార్ధి విభాగం, రాయలసీమ యూనివర్సిటీ విద్యార్ధి విభాగం నేతలను శుక్రవారం రాత్రి నుండే అదుపులోకి తీసుకుంటున్నారు. అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరినీ అదుపులోకి తీసుకోవటం లేదా అరెస్టులు చేయటం చూస్తుంటే చంద్రబాబులో ఎంతటి అభద్రత ఉందో అర్ధమైపోతోంది.