ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు మతిభ్రమించిందని.. గత ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పిన ఆయనకు బుద్ధి రాలేదని చీఫ్ విప్ మండిపడ్డారు. మళ్లీ జమిలి ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని బాబుని ఎద్దేవా చేశారు. ఈ సారి ఎన్నికలు జరిగితే టీడీపీకి ఒక్క సీటు కూడా రాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.


చంద్రబాబు చేసిన " మాతో పెట్టుకుంటే మటాష్ అని" వ్యాఖ్యలపై శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గతంలో కూడా అసెంబ్లీలో ఒకసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని.. ఆ మరుసటి రోజే ఆయన కనిపించకుండా పోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్ రెడ్డి. ఈ విషయంపై ఇప్పటికీ తమకు అనుమానాలు ఉన్నాయని.. సమగ్ర విచారణ జరిపించాలన్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అని ఆయన చంద్రబాబుని తప్పుబట్టారు.


చంద్రబాబు పదే.. పదే రాయలసీమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసలు సీఎం గా  పనిచేసిన ఏ వ్యక్తి కూడా ఒక ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడారని అన్నారు. అందుకే రాయలసీమ ప్రజలు చంద్రబాబుకి తగిన బుద్ది చెప్పారన్నారు. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా సహా రాయలసీమలో చావుదెబ్బ తగిలిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు.. పవన్.. రాయలసీమను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని.. వాళ్లిద్దరూ సీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


వైఎస్ వివేకా హత్య కేసు ఛేదించలేకపోయారని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. చాలా పకడ్బందీగా కేసు విచారణ జరుగుతోందని.. అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. వివేకా హత్య.. ఆ తరువాత చంద్రబాబు చేసిన కుట్రలను స్పష్టంగా ప్రజలకు వివరిస్తామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ చావు కారణాలపై కూడా విచారణ జరిపిద్దామంటూ సవాల్ చేశారు ప్రభుత్వ చీఫ్ విప్.

మరింత సమాచారం తెలుసుకోండి: