తెలంగాణకు ప్రధాని మోడీ అండగా నిలిచారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ప్రధాని ప్రశంసించారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు,కార్మికులు ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించవద్దని, అందరినీ ఆదుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ఇందులో భాగంగా సాధారణ కార్డులకు బియ్యం అందిస్తూ.. వలస కూలీలు, కార్మికులకు ఒక్కొక్కరికి 12కిలోల బియ్యంతోపాటు రూ.500లు ఇస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు దేశంలోని మరే రాష్ట్రం కూడా తెలంగాణలాగా ముందస్తు చర్యలు చేపట్టలేదు. ప్రజలకు మరింతగా అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ కేంద్రం సాయం చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించారు. ఏకంగా తెలంగాణకు 50వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం పంపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలతోపాటు వలస కూలీలు, కార్మికులకు మరింతగా భరోసా ఏర్పడుతుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజానికి.. గత సోమవారం నుంచే తెలంగాణ వ్యాప్తంగా బియ్యంతోపాటు రూ.500 రూపాయల నగదు పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మరోవైపు.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అయితే.. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ఉదంతం తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ ఉంచి ఈ మర్కజ్కు సుమారు వెయ్యిమందికిపైగా ముస్లింలు వెళ్లిరావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అమాంతంగా పెరిగిపోయింది. ఇన్నిరోజులూ కేవలం హైదరాబాద్, కరీంనగర్లకే పరిమితం అయిందనుకున్న కరోనా ఇప్పుడు మిగతా జిల్లాలకు కూడా వ్యాపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీకి వెళ్లిన వారందరినీ గుర్తించి, వైద్యసేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేసేందుకు రెడీ అవుతోంది. శుక్రవారం ఉదయం ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మరింత అప్రమత్తం చేసేదిశగా చర్యలు తీసుకోనుంది.