నవాబులు నిర్మించిన భాగ్యనగరం అభివృద్దితో పాటే కాలుష్యం బారినా పడింది. ప్రత్యేకించి జలాశయాలు దారుణంగా కలుషితమవుతున్నాయి. ఇక హుస్సేన్ సాగర్, మూసీ నదలు సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆ రెండింటి పక్క నుంచి వెళ్లాలంటే ముక్కుమూసుకోక తప్పని దుస్థితి నెలకొంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ రెండింటి ప్రక్షాళన దృష్టి సారించింది.
ఓవైపు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కొన్నాళ్లుగా వేగంగా సాగుతోంది. ఇప్పుడు మూసీనది సుందరీకరణ పనులను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ నాటికి మూసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారట. ఇందుకు సర్కారు పూనిక ఒక్కటే సరిపోదు బాట్టి ప్రైవేటు బ్యాంకుల నుంచి కూడా రుణాలు తీసుకుంటారట.
ఇందుకోసం మూసీ నది అభివృద్ధి సంస్థ పేరుతో ప్రత్యేకంగా ఓ కార్పోరేషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుత బడ్జెట్ లో ఈ కార్పోరేషన్ కోసం 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అవసరమైన ఇతర నిధులను కార్పోరేషన్ ద్వారా సేకరిస్తారట. వివిధ బ్యాంకుల ద్వారా 1500 కోట్ల రూపాయలను రుణంగా తీసుకునేందుకు మూసీ నది అభివృద్ధి కార్పోరేషన్ కు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఔటర్ రింగ్ రోడ్ వరకూ మూసీ సుందరీకరణ పనులు పూర్తి చేస్తారట. మొదట ముసారాంబాగ్ వరకు నదిని పూర్తి స్థాయిలో శుద్ధి చేస్తారు. రెండో దశలో ముసారాంబాగ్ నుంచి నాగోల్ వరకు బాగు చేస్తారు. మూడో దశలో నాగోల్ నుంచి ఔటర్ వరకూ ప్రక్షాళన చేస్తారట. నదిని శుద్ది చేయడంతో పాటు అవసరమైన చోట్ల చెక్ డ్యామ్ లు, వంతెనలు, పార్కులు నిర్మిస్తారట.