విభజనతో నష్టపోయిన ఏపీకి ఇద్దరు నాయుళ్లు(చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు) తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ గతంలో పదేపదే విమర్శించారు! కానీ ఇప్పుడు అదే వెంకయ్యనాయుడి ముందు మోకరిల్లేందుకు సిద్ధంగా ఉన్నారు. హోదా ఇస్తామని చెప్పి.. మాట మార్చిన వెంకయ్యపై పదే పదే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ ఇప్పుడు ఆయనపైనే ప్రశంసల జల్లులు కురిపించే ప్రయత్నాల్లో ఉన్నారు. హోదా ఇవ్వకుండా మాటమార్చిన బీజేపీతో పొత్తుకు జగన్ తహతహలాడుతున్న తీరు.. అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థికి బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పిన ఆయన.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ చేశారు.
ఎందుకీ అత్యుత్సాహం! ఎందుకింత కంగారు?! ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్ తీరు చూస్తున్న వారంతా వేస్తున్న ప్రశ్నలు! ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే కొత్త పొత్తు కోసం ఆయన పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు! రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తమ మద్దతు ఉంటుందని ముందుగానే చెప్పి.. తన అత్యుత్సాహాన్ని ప్రకటించేశారు. కనీసం హోదా గురించి ఆలోచించినా,, హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామని మాట మాత్రం అనకుండా.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరైనా మద్దతు ఇచ్చేస్తామని ప్రకటించారు. అప్పుడు జగన్ తొందరపాటు నిర్ణయాన్ని విమర్శించిన వారే.. జగన్ మళ్లీ ఇలాంటి తప్పే చేస్తున్నాడని చెబుతున్నారు.
రాష్ట్రపతిగా ఎన్నిక కాక ముందే రామ్ నాథ్ కోవింద్ ను బుట్టలో వేసుకునే పని చేసింది వైసీపీ. ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ముందుగానే ఆయన వద్దకు వెళ్లి మరీ పోటోలు దిగి వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన రామ్ నాథ్కు జగన్ పాదాభివందనం చేశారు. ప్రధాని మోడీకి అలా చేయలేదు కానీ ఇప్పుడు కోవింగ్ కు చేసేసరికి అందరికీ అనుమానాలు వచ్చాయి.
ఇప్పుడు వెంకయ్యనాయుడును ఆకట్టుకునే పని చేస్తున్నారు వైసీపీ నేతలు. నిన్నటి వరకు వెంకయ్య అంటే నిప్పులు చెరిగిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ప్రకటించక ముందే ఆయనకు పోన్ చేసి అభినందించారు. ఆ తరువాత హస్తినలో వెంకయ్య ఇంటికి వెళ్లి మరీ అభినందనలు తెలిపారు.
బీజేపీ కూటమిలో భాగస్వామ్యం కాకపోయినా వెంకయ్యకు మద్దతు పలికింది జగన్ పార్టీ. తెలుగోడు వెంకయ్యకు మద్దతు ప్రకటిస్తు తమ పత్రిక, టీవీల్లో బ్రేకింగ్స్ ఇచ్చారు. అంతే ఇక వెంకయ్య తమ వాడు అన్నట్లుగా ప్రచారం మొదలైంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు దీనిని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి మరి! ఎంతైనా జగన్ అత్యుత్సాహం మాత్రం మరోసారి చర్చనీయాంశమైంది. బీజేపీతో పొత్తు కోసం జగన్ వెంపర్లాడుతోన్నట్టే అన్నది స్పష్టంగా కనపడుతోంది.