భాగ్యనగరం కొత్తందాలు సంతరించుకుంది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జీఈఎస్ కోసం నగరాన్ని ముస్తాబు చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా సహా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరవుతుండటంతో నగరాన్ని తళతళ మెరిసేలా తీర్చిదిద్దుతున్నారు. పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి సదస్సు జరిగే ప్రాంతంతో పాటు వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ ప్రాంతాలను అందంగా కనబడేలా చూస్తున్నారు.
45కోట్ల అంచనాతో వందకుపైగా రోడ్లు, ఫుట్ పాత్ ల మరమ్మతులు, సుందరీకరణ, లైటింగ్, రోడ్ మార్కింగ్, సైన్ బోర్డులు ఏర్పాటు వంటి పనులు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన అధికారులు ఏర్పాట్లను పూర్తిచేస్తున్నారు. వందలమందిని మోహరించారు. అన్నీ పనులు దాదాపూ పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. బంజారాహిల్స్, హెటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో రోడ్ల సుందరీకరణకు మిల్లింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
దీంతో పాటు ఫ్లైఓవర్లు, కూడళ్లను రంగులతో నింపేస్తున్నారు. రంగులు వెలసిపోయి కళావిహీనంగా కనబడుతున్న వాటికి వీటితో కొత్తరూపు తీసుకువస్తున్నారు.హెచ్ఐసీసీ, హైటెక్ సిటీ ప్రాంతాల్లో రోడ్లను మెరుగు పరుస్తున్నారు. సరైన నిర్వహణ లేకపోవడంతో పాటు ఇటీవలి వర్షాలకు నగర రోడ్లు నాశనమయ్యాయి. రోడ్లు బాగు చేస్తున్నామని జీహెచ్ఎంసీ ప్రకటించినా అవి పైపై మెరుగులే... దీంతో నగరవాసులు నరకం చూస్తున్నారు. అయితే ఈ జీఈసీ సదస్సు పుణ్యమా అని రోడ్లను బాగు చేస్తున్నారు.
గుంతలు పూడుస్తున్నారు. చాలాచోట్ల కొత్త రోడ్లు వేయిస్తున్నారు. డివైడర్లకు రంగులు అద్దుతున్నారు. ఇన్ని ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం, అధికారుల కంటే ప్రజలు ఎక్కువగా ఇవాంకానే మెచ్చుకుంటున్నారు. నిన్నమొన్నటి దాకా లక్షల మంది ప్రజలు రోడ్లు మహాప్రభో అని మొత్తుకున్నా పట్టించుకోని పాలకులు ట్రంప్ కూతురు వస్తుందనేసరికి నడుం వంచారు.
అమ్మగారు కాలుపెట్టకుండానే నగరం రూపురేఖలు మారిపోయాయి. గుంతలుపడిన రోడ్లపై పడుతూ లేస్తూ ముందుకెళుతూ, గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ తో చుక్కలు చూస్తున్న నగర ప్రజలకు ఇవాంక చాలా మేలే చేసింది.