జనసేన అధినేత పవన్న కల్యాణ్ మాటలు వింటుంటే అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి. ఇపుడు బిజెపిని నానా రకాలుగా తిడుతున్న చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల్లో మోడితో జతకట్టి చేయి పట్టుకుని ఓట్ల కోసం వస్తారన్న అనుమానాన్ని పవన్ వ్యక్తం చేయటం ఆశ్చర్యంగా ఉంది. మోడి, చంద్రబాబు బంధం పై ఎటువంటి సమాచారం లేకుండానే పవన్ బహిరంగసభలో వ్యాఖ్యలు చేస్తారా ?
చంద్రబాబు పాలనంతా అవినీతిమయమే
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా పవన్ అనుమానాలకు ఆధారాలుగానే కనిపిస్తున్నాయి. ఎలాగంటే, నాలుగేళ్ళు కలిసి బిజెపి, టిడిపి కాపురం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో అటు బిజెపి నేతలకు ఇటు చంద్రబాబుకు కనబడని ఎదుటివారిలోని లోపాలు విడిపోగానే బూతద్దంలో కనిపించాయి. సరే, ఒకపార్టీ లోపాలను, అవినీతిని మరొకపార్టీ నేతలు ఎత్తి చూపుతున్నారు బహిరంగంగానే. కాకపోతే ఏపికి కేంద్రం అన్యాయం చేసిందని చంద్రబాబు అండ్ కో చెబుతుంటే, చంద్రబాబు పాలన మొత్తం అవినీతిమయమే అంటూ బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. పైగా తమ ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు బిజెపి నేతలు.
అవినీతిపై ఎందుకు విచారణ జరపటం లేదు ?
ఆరోపణలు, విమర్శల వరకూ బాగానే ఉంది. మరి, చంద్రబాబు అవినీతికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు కదా ? ఇవిగో చంద్రబాబు అవినీతికి ఆధారాలంటూ కొన్ని కాగితాలను బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు, ఎంఎల్సీ సోము వీర్రాజు లాంటి వాళ్ళు చూపుతున్నారు కదా ? బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ కేంద్రం నిధులతో ముడిపడి ఉన్నవే. మరి అటువంటప్పుడు చంద్రబాబు అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణకు ఆదేశించటం లేదు. నిజంగానే బిజెపి-చంద్రబాబులు విడిపోతే, ప్రధానమంత్రి నరేంద్రమోడి పాలనపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ మాట్లాడుతూ, ఎన్డీఏలో లేకపోయినా చంద్రబాబు తమకు శాస్వత మిత్రుడే అంటూ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటుంది. సో, ఇవన్నీ చూస్తుంటే నరసాపురం సభలో మోడి, చంద్రబాబు బంధంపై పవన్ చేసిన వ్యాఖ్యల్లో నిజమే అని అనిపిస్తోంది.