మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని భారత అత్యున్నత పురస్కారం వరించింది. మోడీ సర్కారు ప్రణబ్ ముఖర్జీని భారత్ రత్న పురస్కారంతో గౌరవించింది. ఎలాంటి ఊహాగానాలు, లీకుండా వెలువడిన ఈ నిర్ణయం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది.
త్వరలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్న మోడీ సర్కారు.. ఓటర్లను వల్లో వేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను వాడుకుంటోందన్న వాదనలు ఉన్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు అగ్రవర్ణపేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడం ఇందుకు ఓ ఉదాహరణ.
ఇప్పుడు జీవితమంతా కాంగ్రెస్ పార్టీలో పని చేసిన ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న పురస్కారం అందించడం వెనుక కూడా ఓట్ల రాజకీయమే ఉందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. బెంగాల్లో టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్న బీజేపీ.. దాదాకు భారత రత్న ఇవ్వడం ద్వారా వారిని ప్రసన్నం చేసుకోవచ్చని భావిస్తున్నారు. మమతా బెనర్జీ ఎత్తుగడలను తట్టుకోలేకపోతున్న కమల దళం ఇప్పుడీ ఎత్తు వేసి ఉండొచ్చు.
దీనికితోడు ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న వెనుక ఆర్ఎస్ఎస్ ఒత్తిడి కూడా పనిచేసి ఉంటుందని భావిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైన హెడ్గేవార్ ఇల్లు సందర్శించడం కూడా ఈ పరిణామానికి దోహదపడి ఉండొచ్చని కూడా అంటున్నారు. ఏదేమైనా బెంగాలీ రాజకీయ దిగ్గజం భారత రత్నంగా గుర్తించబడింది.