నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగనుండగా, ఇప్పటికే మంత్రిగా ఉన్న మహమూద్ అలీకి తోడుగా, మరో 10 మంది నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత కేబినెట్లో మంత్రులుగా పని చేసిన ఈటల, జగదీష్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, తలసానికి మళ్లీ ఛాన్స్ దక్కింది. అలాగే ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి, కొప్పుల, శ్రీనివాస్ గౌడ్ కొత్తగా మంత్రి పదవులు పొందనున్నారు.
సామాజిక వర్గాలవారీగా మంత్రి పదవులు దక్కనున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత మరో ఆరుగురితో తుది విస్తరణ జరుగనుంది. రాజ్భవన్లో జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహా మొత్తం 481 మంది హాజరవుతున్నారు. ఇద్దరు మాజీ గవర్నర్లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితతో కలిపి 13 మంది న్యాయమూర్తులు, 14 మంది సలహాదా రులు, ప్రత్యేక ప్రతినిధులు, 58 మంది కార్పొరేషన్ల చైర్పర్సన్లు, 15 మంది లోక్సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు, 120 మంది ఎమ్మెల్యేలు, 33 మంది ఎంఎల్సిలు, 32 మంది ఐఏఎస్ అధికారులు, 44 మంది ఐపీఎస్ అధికారులు, నలుగురు ఐఎఫ్ఎస్ అధికారులు, మేయర్, డిప్యూటీ మేయర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, అడ్వొకేట్ జనరల్, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు.. మొత్తం 481 మంది ఆహ్వానితులు మంత్రివర్గ విస్తరణకు హాజరవుతున్నారు.
కేసీఆర్ నిలబెట్టుకున్నారు : ఎర్రబెల్లి భావోద్వేగం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను అందరిని కలుపుకొని పనిచేస్తానని, జిల్లా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని అన్నారు. గతంలో తాను తెలుగు దేశం పార్టీలో ఉన్న సమయంలో చంద్రబాబు తనని మంత్రిని చేస్తానని మాట తప్పారని, కానీ.. కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని సంతోషాన్ని వెలిబుచ్చారు.
సీఎం ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తా : ఇంద్రకరణ్ రెడ్డి
తనకు మరోసారి మంత్రి గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ప్రజలకి ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నారని, కోటి ఎకరాలకు నీరు అందించాలనేది ఆయన సంకల్పమని ఇంద్రకరణ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించామని కాబోయే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేసారు.
సీఎం అప్పజెప్పిన పనిని సమర్థవంతంగా చేస్తా : మల్లారెడ్డి
తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన సిఎం కేసీఆర్, కేటీఆర్ కు కృతజ్ఞతలు అని కాబోయే మంత్రి మల్లారెడ్డి ఎన్టీవీతో చెప్పారు.చిన్నప్పటి నుంచి పేద ప్రజల కోసం ఎంతో కష్టపడి పని చేసానని అన్నారు. హైదరాబాద్ బోయినపల్లి సాయిబాబా ఆలయంలో మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.