సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. ఇవాళ సచివాలయంలో మంత్రి వర్గ ఉప సంఘం బేటి అయింది.
ఈ సమావేశం అనంతరం మంత్రి నాని మాట్లాడుతూ, రేషన్ దుకాణాల ద్వారా పంపిణీలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు.కల్తీలేని, తినేందుకు అనువైన సన్న బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న బియ్యం పక్కదారి పడుతుందన్న ఆయన, కేంద్రం నుంచి వస్తున్న బియ్యంలో ఇరవై ఐదు శాతం నూక ఉంటోందన్నారు.
నాణ్యత లేని బియ్యం సరఫరా వల్ల అన్నం ముద్దగా మారుతుందన్నారు.అందుకే సన్న బియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయించామన్నారు. ఇందుకు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమౌతాయని కొడాలి తెలిపారు. సన్నబియ్యం పంపిణీ కోసం ప్రభుత్వంపై వెయ్యి కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నామని వెల్లడించారు.