టెక్నాలజీ పెరిగిపోతుంది..దాంతో మనిషి అవసరాలు కూడా తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారు.  ఎన్నో కష్టతరమైన పనులను టెక్నాలజీ ద్వారా సులభతరం చేసుకుంటున్నాడు.  ఒకప్పుడు తన స్నేహితులతో బంధువులతో మాట్లాడాలంటే టెలిఫోన్ బూతుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న చోటే ప్రపంచాన్ని చుట్టి వచ్చేంత సౌలభ్యం వచ్చింది.  ఒకప్పుడు ఏదైనా బుక్ చేసుకోవాలంటే ఆ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది..కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తో ఉన్నచోటి నుంచే బుక్ చేసుకునే సౌలభ్యం వచ్చింది. 

ఇప్పుడు ఇదే టెక్నాలజీ ఉపయోగించి ఒకే దేశం-ఒకే కార్డు ప్రత్యేక పథకం తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో  తెలంగాణలో రేషన్ పోర్టబులిటీ విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ వాసులు శుక్రవారం తెలంగాణలో రేషన్ కార్డులు తీసుకున్నారు. ఒకే దేశం-ఒకే కార్డు విధానాన్ని వచ్చే ఏడాది జూన్‌లోగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. 

ఈ రెండు రాష్ట్రాలతోపాటు గుజరాత్, మహారాష్ట్రలను రెండు క్లస్టర్లగా ఏర్పాటు చేసి ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నారు. ట్రయల్ ‌రన్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ రేషన్ దుకాణంలో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, విశాఖపట్టణం జిల్లా యలమంచిలికి చెందిన ఇద్దరు వ్యక్తులు విజయవంతంగా రేషన్ సరుకులు తీసుకున్నారు. 


ఇక ట్రయల్ రన్ విజయవంతం అయిన తర్వాత పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ మాట్లాడుతూ..ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో రేషన్ పోర్టబులిటీని గతేడాది ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వలసదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: