చంద్రబాబుది తిరిగే కాలు, మాట్లాడే నోరు. ఆయన ఇపుడు పూర్తిగా ఖాళీ అయిపోయారు. ఇదివరకు మాదిరిగా లెక్చర్లు దంచుదామంటే తమ్ముళ్ళు అందుబాటులో ఉండడంలేదు. టెలికాన్ఫరెన్సులు లేవు, వీడియో సమావేశాలు లేవు, స్పెషల్ ఫ్లైట్లు లేవు, టూర్లు అంతకంటే లేవు. మరి బాబోరు ఏం చేస్తారు. దాంతో ఆయన మళ్ళీ బిజీ అవుదామనుకుంటున్నారు. ఎలా అంటే చంద్రబాబు కి వేరే ఎవరైనా చెప్పాలా. ఆయన రాజకీయ దురంధరుడు మరి.
చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కి తాజాగా రెండవ లేఖ రాశారు. మొదటి లేఖ ఆయన జూన్ మొదటి వారంలో రాశారు. అప్పట్లో ఆయన ప్రజావేదిక భవనాన్ని తనకు ప్రతిపక్ష నేత హోదాలో ఇమ్మని అడిగారు. ఇపుడు మూడు నెలల తరువాత మళ్ళీ లేఖ రాయడం విశేషం. ఈసారి లేఖలో ఆయన జగన్ కి అచ్చం సలహాదారుగా మారిపోయారు. ప్రతిపక్ష నాయకుడు సీఎం కి డిమాండ్లు చెబుతున్నట్లుగా బాబు లేఖ లేదు.
జగన్ మీరు సీఎం గా ఇది చేయాలి. అది చేయాలి. ఇలా చేయండి అటూ చీఫ్ అడ్వైజర్ అవతారం ఎత్తేశారు. వరద బాధితుల వివరాలు నష్టం అంచనాలు చేసి తొందరగా కేంద్రానికి నివేదిక పంపితే బాగుంటుందని జగన్ కి బాబు సూచించడం విశేషం. అలాగే ఇకపై వరదలు వచ్చినపుడు మరింత సాంకేతిక సంపత్తితో చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా సలహా ఇచ్చారు.
మొత్తానికి చూడబోతే ఈ సీనియర్ పొలిటీషియన్ జగన్ కోరకపోయినా సలహాలు ఇస్తూ వైసీపీ సర్కార్ కి అనధికార సలహాదారుగా మారుతున్నారా అనిపిస్తోంది. మరి జగన్ చంద్రబాబు మాట వింటారా లేదా అన్నది చూడాలి. పనిలో పనిగా తాను ఇవ్వలేకపోయిన నాలుగు, అయిదవ విడత రైతు రుణ మాఫీ మొత్తాలను చెల్లించమని జగన్ కి అర్జీ పెట్టేశారు చంద్రబాబు.