కింగ్ ఫిషర్ తాగి కింగ్ లా ఎంజాయ్ చేయాలనుకున్న వారిని విగతజీవులుగా మార్చిన ఘటనలు లేకపోలేదు. జగిత్యాల జిల్లా లో కింగ్ ఫిషర్ బీర్ దొరకకపోవడంతో ఇరుగు పొరుగు జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి తయారైంది. ప్రోహిబిషన్ సమయంలో మందుబాబులు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్లినట్లు గానే, జగిత్యాల జిల్లా వాసులు పొరుగు జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి తయారైంది.లిక్కర్ సిండికేట్ మాఫియా కారణంగా జరుగుతున్న ఈ తంతును కట్టడి చేసేందుకు చట్టాలు కూడా మూగబోయాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన వారు కింగ్ ఫిషర్ బీర్ ల కోసం మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట,పెద్దపల్లి జిల్లా ధర్మారం, నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి, సిరిసిల్ల జిల్లా వట్టెంలా ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇందుకోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకొని కింగ్ ఫిషర్ బీరు కొనుక్కునేందుకు డ్యూటీలు కూడా వేసుకుంటున్నారట. వంతులవారీగా ఇరుగు పొరుగు జిల్లాలకు వెళ్లి బీర్ లను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీర్ బాబులు.

 అయితే మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటప్రాంతానికి వెళ్లి బీర్లు కొనుగోలు చేసుకొని తిరిగివస్తుండగా ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఒకటి రెండు ఘటనల్లో ప్రాణాలు కూడా కోల్పోయారని జగిత్యాల ప్రాంతాల వాసులు తెలిపారు. మద్యం సిండికేట్ మాఫియాతో అన్ని రకాల బ్రాండ్లను విక్రయించాల్సిన వ్యాపారులు సాహసించేందుకు  ముందుకు రావడం లేదన్న చర్చసాగుతోంది. లిక్కర్ సిండికేట్ మాఫియా చెలరేగిపోతున్న తీరుపై కూడా సర్వత్రా చర్చ సాగుతోంది. బట్టలూడదీసి కొడతాం..మాకేమిస్తావో చెప్పు, మేం తలుచుకుంటే ఏమైనా చేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నా నియంత్రించే వారే లేకుండాపోయారు అన్న విమర్శలు వస్తున్నాయి. నిర్భయంగా చెలరేగిపోతున్న మాఫియాకు వెన్నుదన్నుగా బలమైన వారే నిలుస్తున్నారని,ఈ కారణంగానే వారు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బడాబాబుల అండదండలతో మాఫియా రెచ్చిపోతుందని, ఇందుకు ఎక్సైజ్ శాఖ కూడా వత్తాసు పలుకుతోందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురు జగిత్యాల కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం,కింగ్ ఫిషర్ బీర్ ల కోసం ఆందోళన చేయడం వంటి చర్యలకు పూనుకున్నా, ఎక్సైజ్ అధికారులు మాత్రం ఈ వ్యవహారం పై కఠినంగా వ్యవహరించక పోవడం గమనార్హం. ఏదిఏమైనా జగిత్యాలలో లిక్కర్ సిండికేట్ మాఫియా పై కొరడా ఝలిపించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: