సుప్రీంకోర్టు ఆదేశాల్ని అనుసరించి గ్రూపు-1 (2011) ప్రధాన పరీక్షల ఫలితాలు, గ్రూపు-2 (1999) నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన 927 మంది అభ్యర్థుల జాబితాను విడివిడిగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 22వ తేదీ రాత్రి ప్రకటించింది. * గ్రూపు-1 ప్రధాన పరీక్షలో ఎంపిక చేసిన 291 మందికి మౌఖిక పరీక్షలు ఏప్రిల్ 18 నుంచి మే 10 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెలువడిన ఈ నోటిఫికేషన్ అనుసరించి ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పుల వివాదం ట్రైబ్యునల్ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. చివరికి.... సుప్రీంకోర్టు ఆదేశాలతో మరోదఫా నిర్వహించిన ప్రధాన పరీక్షలను కిందటేడాది జరిపారు.
ఫలితాలను ఇటీవల ప్రకటించారు. అయితే...దొర్లిన తప్పులను అనుసరించి నిర్థారించిన మార్కుల స్కేలింగ్ ప్రకారం కాకుండా మరో పద్ధతిలో ఫలితాలు వెల్లడించారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రస్తుతం సవరించి కొత్త జాబితాను అధికారులు ప్రకటించారు. దీనివల్ల కొందరికి మౌఖిక పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం లభించగా...మరికొందరికి దూరమైనట్లు భావిస్తున్నారు. గతంలో ఇదే నోటిఫికేషన్ ద్వారా మౌఖిక పరీక్షలకు హాజరైన వారు మళ్లీ ఎదుర్కోబోతున్నారు. అప్పట్లో మౌఖిక పరీక్షలు జరిపినా ఏపీపీఎస్సీ ఫలితాలను వెల్లడించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మొత్తం మళ్లీ మొదటికొచ్చింది.