తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కాలా’చిత్రానికి అన్ని వైపుల నుంచి కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే కావేరీ జలాల వివాదంతో కర్ణాటకలో కాలా చిత్రాన్ని రిలీజ్ కానివ్వబోమని తెగేసి చెప్పారు. ఈ వివాదం ముగియకముందే మరో కొత్త వివాదం కాలా చిత్రానికి వచ్చిపడింది. జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. అయితే తాజా పరిణామాలు ‘కాలా’కు బ్రేకులు వేసేలా కనిపిస్తున్నాయి. ‘కాలా’ చిత్రం లో తన తండ్రి పేరు, జీవిత కథను వాడుకున్నారంటూ ముంబైకి చెందిన జర్నలిస్టు జవహర్ నాడార్.. రజినీకాంత్తో పాటు ‘కాలా’ టీంకు లీగల్ నోటీసులు పంపారు.
తన నోటీసుపై సమాధానం రాకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. జవహర్ వాదన ప్రకారం..తన తండ్రి తిరవయమ్ నాడార్ 1957లో టుటికోరిన్ నుంచి ముంబైలోని ధరవికి వచ్చారు. అప్పట్లో టుటికోరిన్లో తీవ్రమైన కరువు, నీటి ఎద్దడి కారణంగా చాలా మంది ధరవికి వలస వచ్చారు. అయితే స్వయంకృషితో ఎదిగిన తిరవయమ్ నాడార్.. ధరవిలో మంచి పేరు సంపాదించారు.
ఆ ప్రాంతంలో ప్రజలు నాడార్ను ‘గుడ్వాలా సేఠ్’, ‘కాలా సేఠ్’ అని పిలిచేవారని జవహర్ పేర్కొన్నారు. ధరవిలో తన తండ్రి చక్కెర, బెల్లం వ్యాపారం చేసేవారని తెలిపారు. అయితే ‘కాలా’ సినిమాలో తన తండ్రి కథను వాడారా లేదా అనే విషయంపై తనకు విరవణ కావాలని, ‘కాలా’ టీం వివరణ ఇవ్వాలని జవహర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.
ఒక వేళ సినిమా కథ తన తండ్రిదే అయితే తన పేరును టైటిల్ కార్డులో ప్రస్తావించాలని, అలాగే రూ.100 కోట్ల పరువు నష్టం చెల్లించాలని సూచించారు. రాజకీయ లబ్ది కోసమే రజినీకాంత్, పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు తాను నమ్ముతున్నానని జవహర్ పేర్కోన్నారు. ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్న జవహర్.. ఇప్పుడు ‘కాలా’ విడుదలను అడ్డుకోవడానికే ఈ నోటీసులు పంపించారని సినీ విశ్లేషకులు అంటున్నారు.