దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ 'తలైవి' అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ బయోపిక్ షూటింగ్ అక్టోబర్ నుండి మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బయోపిక్ లోనే మరో కీలకమైన పాత్ర ఎం.జి.రామచంద్రన్ ది. ఇప్పుడు ఈ పాత్రలో అరవింద్ స్వామి నటించబోతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు మురళీ శర్మ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ నుంచి స్పెషల్ మేకప్ టీమ్ ఇండియాకు రానున్నారు. హాలీవుడ్ మూవీ 'డార్కెస్ట్ హవర్'కి మేకప్ మెన్ గా పనిచేసిన 'గ్యారీ ఓల్డ్ మెన్, 'అమ్మ' బయోపిక్ కూడా చెయ్యనున్నారు. ఈ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లుతో రూపొందుతుంది. ఎలాగూ కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లుపెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది.
కాగా ఇప్పటికే ఈ సినిమా కోసం తమిళం కూడా నేర్చుకున్న ఈ బాలీవుడ్ క్వీన్ ఇప్పుడు బరువు కూడా పెరుగుతుందట. ఈ సినిమా కోసం దాదాపు పది కిలోలు వరకూ కంగనా బరువు పెరగుతున్నట్లు తెలుస్తోంది. ఇక విజయేంద్ర ప్రసాద్ కథ రాసే ముందే జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని కూడా కథలో హైలెట్ చేస్తూ కథ రాశారట. ముఖ్యంగా ఒక హీరోయిన్ని ఒక రాష్ట్రం మొత్తం అమ్మగా భావించడానికి గల కారణాలు ఏమిటి అన్న పాయింట్ ని ప్రధానంగా తీసుకోని కొత్త కోణంలో ఈ కథ రాశారట. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది, మరి ఈ చిత్రం ఈ మూడు భాషల్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.