తెలంగాణలో ప్రస్తుత సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణం నేపథ్యంలో...ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విధులు చేపట్టే బీఆర్కే భవన్లోకి ఇంకా పూర్తి తరలింపు కాని నేపథ్యంలో...కొత్త అవకాశాలు కల్పిస్తోంది. సెక్రటేరియెట్ షిఫ్టింగ్, బీఆర్కే భవన్ మరమ్మతులు జరుగుతుండడంతో కొందరు ఉన్నతాధికారులు ఇంటి దగ్గర్నుంచే పని చేయనున్నారు. ఆర్థిక శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల, రెవెన్యూ, ఎక్సైజ్ తదితర శాఖల ముఖ్య కార్యదర్శుల పనులకు ఆటంకం కలగకుండా సీఎస్ ఎస్కే జోషి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులకూ సీఎస్ సూచించారు.
వరుస సెలవులతో సెక్రటేరియెట్ షిఫ్టింగ్ పనుల్లో వేగం కాస్త తగ్గింది. శనివారం జీఏడీలోని పలు ఫైళ్లు, ఫర్నీచర్ను సర్దిపెట్టారు. ఎక్కువ సామాను ఉండడంతో జీఏడీ, సీఎస్ పేషీల షిఫ్టింగ్కు ఇంకొంత సమయం పడుతుందని అంటున్నారు. బీఆర్కే భవన్కు రిపేర్లు పూర్తి చేసేందుకు వారం నుంచి పది రోజులు పట్టే అవకాశముంది. ఇప్పుడు పెయింటింగ్తో పాటు వివిధ శాఖల క్యాబిన్లలో ఫ్యాన్లు, లైట్లు పెడుతున్నారు. సెక్రటేరియెట్, బీఆర్కే భవన్లో డ్యూటీ చేయలేని కారణంగా వర్క్ ఫ్రం హోం నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. సీఎస్ జోషి కూడా కొన్ని రోజలు కుందన్బాగ్లోని ఇంటి నుంచే పనిచేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచే సమీక్షలు చేయనున్నారు.
మరోవైపు బీఆర్కే భవన్ ఎంట్రెన్స్ దగ్గర స్కానర్లు ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. అన్ని మరమ్మతులు పూర్తయిన తర్వాతే టెలిఫోన్, ఇంటర్నెట్, సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంటర్కామ్, డేటా సెంటర్, సర్వర్ రూంలు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి బీఆర్కే భవన్లో పూర్తి స్థాయిలో పాలన సాగుతుందని తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఇప్పటికే భవనాన్ని పరిశీలించిన పోలీసులు.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు, బారికేడ్ల ఏర్పాటు, రోడ్ల మూసివేత, బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.