పైగా బుద్ధా వెంకన్న అయితే తాను వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానని మరీ ప్రకటించుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా ప్రస్తుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పోటీ చేస్తారని అంటున్నారు. జయదేవ్ గుంటూరులో రెండుసార్లు వరసగా గెలిచినప్పటకీ ఈసారి మాత్రం ఆయనకు గెలుపు విషయంలో ఇబ్బందులు తప్పవన్న ప్రచారం ఉంది.
ఈ క్రమంలోనే ఆయన్ను ఈ సారి గుంటూరు నుంచి విజయవాడకు షిఫ్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల కోసం పార్లమెంటు సభ్యుల ఎంపిక విషయంలో చంద్రబాబు ఈసారి ఆచితూచి అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే జయదేవ్పై గుంటూరులో ఉన్న అసంతృప్తి నేపథ్యంలో ఈ సారి ఆయన్ను విజయవాడ బరిలోకి దింపుతారని అంటున్నారు. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నానిపై అటు అధిష్టానంలోనూ, ఇటు స్థానిక నేతల్లోనూ అసంతృప్తి ఉంది. అందుకే ఈ సారి ఆయన్ను పక్కన పెట్టడం లేదా మరేదైనా పదవి ఇవ్వవచ్చని అంటున్నారు. నానిని వీలయితే గుంటూరు నుంచి పోటీలో ఉంచడం... లేకుంటే పక్కన పెట్టేయాలన్నదే చంద్రబాబు నిర్ణయమని పార్టీ వర్గాల్లోనే బలంగా టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.