2019 ఎన్నికలకు చంద్రబాబు సమాయత్తమై పోతున్నారు. అవసరమైతే ముందస్తు ఎన్నికలు అయినా ఉండవచ్చన్న సంకేతాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలను ఏపీ, తెలంగాణలో ఎదుర్కొనేందుకు తన కొత్త టీంను రెడీ చేసేసుకున్నారు. ఈ రోజు అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు స్వయంగా టీడీపీ పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీల వివరాలను వెల్లడించారు. పార్టీలో విధేయతకు పెద్దపీఠ వేయడంతో పాటు సామాజిక సమీకరణాలను బేస్ చేసుకుని సమతుల్యతతో కొత్త కమిటీలు, పొలిటిబ్యూరోల్లో చోటు కల్పించారు.
ఇక ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబే ఉంటారు. ఇక ఏపీ టీడీపీ, తెలంగాణ టీడీపీ అధ్యక్షుల విషయంలో మార్పులు చేయలేదు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మంత్రి కళా వెంకట్రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ కంటిన్యూ అవుతారు. వాస్తవానికి మంత్రిగా ఉన్న కళా వెంకట్రావును తప్పించి ఆ ప్లేస్లో మరో వ్యక్తికి ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వచ్చినా బాబు మాత్రం కళానే తిరిగి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగించారు.
ఇక తెలంగాణలో ముందునుంచి విధేయతతో పార్టీనే నమ్ముకుని ఉన్న ఎల్.రమణకే మరోసారి తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించారు. ఏపీ టీడీపీ కమిటీ 105 మంతితో ఏర్పాటు అయితే, తెలంగాణ టీడీపీలో 11 మంది అధికార ప్రతినిధులతో పాటు మొత్తం 114 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. త్వరలో టీడీపీ అనుబంధ సంఘాలకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని చంద్రబాబు తెలియజేశారు.
పొలిటిబ్యూరోలోకి తెలంగాణ నుంచి ఆ ఇద్దరికి చోటు...
ఇక పార్టీ అత్యున్నత విభాగం అయిన పొలిట్బ్యూరోలో రెండు కొత్త ముఖాలు వచ్చి చేరాయి. తెలంగాణ నుంచి పొలిట్బ్యూరోలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీ మారడంతో వారి స్థానంలో మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, సీతక్కలకు స్థానం దక్కింది. వీరిద్దరు అవిభాజ్య వరంగల్ జిల్లాకు చెందిన వారే. వీరు 2009లో ఎమ్మెల్యేలుగా గెలిచి గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఎంతమంది పార్టీ మరినా వీరు మాత్రం తమ వంతుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఇక టీడీపీ జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడిగా కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఎంపికయ్యారు.