విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం అత్యంత కీలకమైంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయబావుటా ఎగుర వేసింది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్, వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్లు పోటీ చేశారు. అయితే, అవంతి ముందు గుడివాడ నిలబడలేక పోయారు. అయితే, కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా ఇక్కడ పాగా వేయాలని వైసీపీ భావిస్తోం ది. దీనికి తగ్గట్టుగా కార్చాచరణ ఉండాలని, ముఖ్యంగా అవంతి లోపాలను ప్రజల్లో ఎండగట్టాలని కూడా ఇప్పటికే జగన్ దిశానిర్దేశం చేశారు.
అయితే, దీనికి తగిన విధంగా గుడివాడ ప్రయత్నిస్తున్నారా? అంటే లేదనే అంటున్నారు వైసీపీ నాయకులు. అంతేకాదు, గుడివాడపై తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం నేపథ్యంలో అనేక మంది కీలకనాయకులు సైతం పార్టీ కార్యకలాపాలకు దూరమవుతు న్నారు. విశాఖలోని గ్రామీణ ప్రాంతంలో అనకాపల్లి నియోజకవర్గం ఎంతో కీలకమైనది. ఈ నియోజకవర్గంలో సీనియర్ రాజకీయ నాయకులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు గతంలోనే ఆ పార్టీకి దూరమయ్యారు. కొణతాలను పార్టీ సస్పెండ్ చేయగా, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీ అధినాయకుడి తీరును నిరసిస్తూ బయటకు వచ్చేశారు.
కాగా గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన గుడివాడ అమర్నాథ్ను జిల్లా కన్వీనర్గా, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా పార్టీ అధిష్ఠానం నియమించింది. అయితే ఆయన తోటి నాయకులను కలుపుకొని పోవడంలో సమన్వయం పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు కనీస గౌరవం ఇవ్వడంలేదని, ఎదురుపడి నమస్కారం చేసినా స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారిలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి వేగి త్రినాథ్, జిల్లా అధికార ప్రతినిధి ఒమ్మి రాముయాదవ్, జిల్లా నాయకుడు పెద్దాడ రామశంకర్, తదితరులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్టు తెలిసింది.
మరికొంతమంది నాయకులు కూడా పార్టీపై అభిమానం ఉన్నా సమన్వయకర్త తీరుతో అసంతృప్తిగా వున్నారు. కొంత మంది నాయకులు బహిరంగంగానే సమన్వయకర్త తీరును విమర్శిస్తున్నారు. ఒక పక్క జగన్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నానా తిప్పలు పడుతున్నాడు. అయితే, విశాఖలో అత్యంత కీలకమైన అనకాపల్లి నియోజకవర్గంలో మాత్రం తీవ్ర వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.
ప్రభుత్వ లోపాలపై కూడా గట్టిగా నిలదీసిన సందర్భాలు లేవు. మొక్కుబడిగా ఇక్కడకు రావడం, ప్రెస్మీట్ పెట్టి వెళ్లిపోవడం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు అధికారంలో ఉన్న వారికంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉండగా అనకాపల్లి వైసీపీ సమన్వయకర్త మాత్రం మింది నుంచి అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి పోతున్నారని వైసీపీకే చెందిన స్థానిక నేతలు విమర్శిస్తున్నారు. ఈ పరిణామం ఇలానే కొనసాగితే.. ఇక్కడ మళ్లీ 2014 నాటి ఫలితం పునరావృతమైనా ఆశ్చర్యం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.