కొందరు వైసిపి ఎంఎల్ఏలను చంద్రబాబునాయుడు టార్గెట్ చేసుకున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కొందరు వైసిపి ఎంఎల్ఏలు చంద్రబాబుకు కొరకరాని కొయ్యలుగా తయారయ్యారు. వారు నిత్యం జనాల్లోనే తిరుగుతుండటం, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుండటమే కాకుండా మీడియాలో తరచూ చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. వీరు లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వం వైపు నుండి సరైన సమాధానాలు ఉండకపోగా ఎదురుదాడితో సరిపెట్టుకుంటోంది. వారిని కంట్రోల్ చేయటం తెలుగుదేశంపార్టీ నేతలకు సాధ్యం కావటం లేదు. అందుకనే అటువంటి వారి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అందుకే ఏదో ఓ కేసులో ఇరికించి వారిని ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది.
ఎంఎల్ఏలపై కేసులు
చంద్రబాబును బాగా ఇబ్బంది పెడుతున్న వైసిపి ఎంఎల్ఏల్లో మంగళగిరి నుండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నెల్లూరు నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగిరి నుండి రోజా, గుడివాడ నుండి కొడాలి నాని, నెల్లూరు రూరల్ నుండి అనిల్ కుమార్ యాదవ్, నరసరావుపేట నుండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ముందు వరసలో ఉంటారు. ముందుగా శ్రీధర్ రెడ్డిని క్రికెట్ బుకింగ్ కేసులో ఇరికించారు. బుక్కీలతో సంబంధాలున్నాయని, క్రికెట్ బెట్టింగ్ లో కోటంరెడ్డి ఇన్వాల్వ్ అయ్యారంటూ కేసులు నమోదు చేశారు. తాజాగా ఆళ్ళవంతు. అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన డిఎస్పీ దుర్గాప్రసాద్ కు ఆళ్ళ భార్య బినామిగా ఉందంటూ ఏసిబి కేసులు పెడుతున్నారు. విచారణ పేరుతో గంటల పాటు అదుపులో ఉంచుకుంటున్నా. చంద్రబాబుపైనే కాకుండా ప్రభుత్వంపై ఆళ్ళ వివిధ కోర్టుల్లో సుమారు 35 కేసులు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేసులతో చంద్రబాబును ఆళ్ళ ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ఫైర్ బ్రాండ్ రోజా
ఇక, ఫైర్ బ్రాండ్ రోజా సంగతి చెప్పనే అక్కర్లేదు. అసెంబ్లీలోపలే కాకుండా బయట కూడా ప్రతీ రోజు చంద్రబాబు తదితరులను రోజా ఉతికి ఆరేస్తోంది. రోజా ధాటిని తట్టుకోవటం టిడిపి వల్ల కావటం లేదు. అందుకనే అసెంబ్లీ నుండి నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేసింది. తర్వాత మహిళా సదస్సుకు హాజరవ్వటానికి వచ్చిన రోజా విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రోజాను టిడిపి అవమానిస్తోంది. అదే విధంగా కాపు రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు దహనం కేసులో వైసిపి ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో రోజుల తరబడి అదుపులో ఉంచుకున్నారు. మరో ఇద్దరు ఎంఎల్ఏలు అనిల్ కుమార్, కొడాలినాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కూడా టిడిపి టార్గెట్ చేసుకుంది. నిజానికి కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటే అంతకన్నా ఎక్కువ కేసులు కొందరు మంత్రులతో పాటు ఎంఎల్ఏలపైన కూడా ఉంది. మళ్ళీ పోలీసులు వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు.
వారినే ఎందుకు టార్గెట్ చేసుకుంది ?
పై ఎంఎల్ఏలతో పాటు నేతలపైనే టిడిపి ఎందుకంత గురి పెట్టిందంటే వచ్చే ఎన్నికల్లో వారికే గెలుపు అవకాశాలున్నట్లు సమాచారం. చంద్రబాబు తరచూ 175 నియోజకవర్గాలపైనా సర్వే చేయిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆ సర్వేల్లో వైసిపి కచ్చితంగా గెలుస్తుందన్న జాబితాలో పై నియోజకవర్గాలున్నాయట. వచ్చే ఎన్నికల్లో ఏదో ఓ విధంగా వారిని ఓడించటమే లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నారు. అందుకనే వైసిపిని మానసికంగా దెబ్బ కొట్టేందుకు తమతో పాటు నేతలపై కేసులు పెడుతున్నట్లు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మండిపడుతున్నారు.