తన పాలనపై జనాల్లో 80 శాతం సంతృప్తి ఉందని చంద్రబాబునాయుడు చెప్పుకోవటం అంతా అబద్ధమని తేలిపోయింది. నిజంగానే అంత స్ధాయిలో జనాల్లో సంతృప్తే ఉంటే పంచాయితీ ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం ఏంటి ? పంచాయితీ సర్పంచులకు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తు ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. సర్పంచుల స్ధానంలో ప్రత్యేకాధికారులను నియమించాలంటూ ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దాంతో ఎన్నికలంటే చంద్రబాబు భయపడుతున్న విషయం స్పష్టమైపోయింది.
పంచాయితీలకు ప్రత్యేకధికారులే
రాష్ట్రంలోని 12,918 గ్రామపంచాయితీలకు పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగిసింది. నిజానికి పై పంచాయితీల్లో ఎన్నికలు నిర్వహణకు కనీసం రెండు నెలల ముందే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ పనిచేయలేదు. పైగా పర్సన్ ఇన్చార్జిలను నియమించేందుకే మొగ్గు చూపింది. అంటే ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలాగుంటుందో అన్న విషయంలో చంద్రబాబులో ఆందోళన స్పష్టంగా కనబడుతోంది. సాధారణ ఎన్నికలకు ముందు అంచనాలు తల్లక్రిందులైతే తెలుగుదేశంపార్టీకి తల బొప్పి కట్టడం ఖాయం. దాని ప్రభావం వచ్చే ఎన్నికలపై పడటమూ ఖాయం. అందుకే పంచాయితీ ఎన్నికలను నిర్వహించే ధైర్యం చేయలేకపోయారు.
వాయిదాకు కారణాలేంటి ?
షెడ్యూల్ ప్రకారం పంచాయితీ ఎన్నికలు నిర్వహించటానికి ఎందుకు చంద్రబాబు భయపడుతున్నారు ? అంటే ప్రభుత్వంపై జనాల్లోని వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టే. గడచిన నాలుగున్నరేళ్ళ పాలన అంతా అస్తవ్యస్ధమే. గ్రామస్ధాయిలో అయితే చెప్పనే అక్కర్లేదు. పేదలకు అందాల్సిన సంక్షేమపథకాల అమలులో జన్మభూమి కమిటీలదే మొత్తం పెత్తనం. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన సర్పంచులను, వార్డు మెంబర్లను పక్కనపెట్టేసి మొత్తం అధికారమంతా జన్మభూమి కమిటీలకు కట్టబెట్టేశారు. చాలా చోట్ల సర్పంచులుగా టిడిపి మద్దతుదారులే ఉన్నా ఉపయోగం లేకపోయింది.
మాఫియాగా తయారైన జన్మభూమి కమిటీలు
జన్మభూమి కమిటీలేమో సంక్షేమ పథకాల లబ్దదారుల ఎంపికలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. చాలా గ్రామాల్లో అర్హులను పక్కనపెట్టేసి అవినీతికి తెరలేపాయి. చివరకు టిడిపికి సంబంధించిన వాళ్ళకు కూడా పథకాలు అందాలంటే డబ్బులు ముట్టచెప్పాల్సిన పరిస్ధితులు తలెత్తాయి. దాంతో మామూలు జనాలతో పాటు టిడిపి మద్దతుదారుల్లో కూడా జన్మభూమి కమిటీలంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేసింది. చివరకు జన్మభూమి కమిటీల పేరుతో పెద్ద మాఫియానే తయారైందని ప్రతిపక్షాలు విమర్శించే స్ధాయికి చేరుకున్నాయి. ప్రతిపక్షాలే కాకుండా టిడిపి నేతలు కూడా అదే విధమైన ఆరోపణలు చేయటంతో పాటు ఒత్తిడి తేవటంతో చంద్రబాబు వేరే దారిలేక జన్మభూమి కమిటీలను రద్దుచేశారు. కమిటీలను రద్దు చేసినా వాటి తాలూకు ప్రభావం అలానే ఉండిపోయింది. దాంతో జనాల్లో ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో వ్యతిరేకత వచ్చేసింది.
ఎన్నికలంటే అంత భయపడుతున్నారా ?
సరే, ఎప్పుడూ భ్రమల్లో ఉండటానికి అలవాటుపడిపోయిన చంద్రబాబు మాత్రం తన పాలనపై జనాల్లో ఎక్కడా వ్యతిరేకత లేదని చెప్పుకుంటూ నెట్టుకొచ్చేస్తున్నారు. ఏ సభలో మాట్లాడినా, ఎప్పుడు సమీక్ష సమావేశలు నిర్వహించినా, టెలికాన్పరెన్సుల్లో కూడా తన పాలనపై 80 జనాల్లో సంతృప్తి కనబడుతోందంటూ ఒకటే ఊదరగొట్టేవారు. నిజంగానే అంత సంతృప్తి ఉంటే పంచాయితీ ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం ఏంటి ? పాలనపై జనాల అభిప్రాయం నిజంగా తెలిసేది గ్రామస్ధాయిల్లోనే. అటువంటి అభిప్రాయాన్ని తెలుసుకోవటానికే చంద్రబాబు భయపడుతున్నారంటే దాని అర్ధమంటో.....