ఏపీతో పాటు తెలంగాణకు చెందిన దాదాపు 7.82 కోట్ల మంది పౌరుల ఆధార్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్ (సేవా మిత్ర) తయారీ సంస్థ - ఐటీ గ్రిడ్స్ - చేతిలో పెట్టిందెవరు? దీని చుట్టూనే ఇప్పుడు సిట్ దర్యాప్తు సాగుతోంది. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ - సీఐడీఆర్, స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ - ఎస్ఆర్డీహెచ్ - వద్ద భద్రంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా? లీకయిందన్నది వారికి సవాలు విసురుతోంది.
ఈ లీకేజీ వెనక ఏపీ సర్కారు పెద్దల హస్తం
ఉండొచ్చని యూఐడీఏఐ అనుమానిస్తోంది. ఇలాంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఆయా
సంస్థల్లో పనిచేసే విచక్షణ ఉన్న ఏ అధికారీ ఇవ్వడని, ప్రలోభాలకు లేదా పెద్దల
ఒత్తిళ్లకు తలొగ్గితేనే ఆస్కారం ఉంటుందని భావిస్తోంది.
ఈ కేసులో ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందం ఇప్పటికే హైదరాబాద్ లోని ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న 40 పైగా హార్డ్ డిస్కులను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) సాయంతో విశ్లేషించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఐటీ గ్రిడ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 40 రోజుల పాటు పరిశోధన జరిపి రూపొందించిన ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ తెలంగాణ సిట్ చేతికి అందింది.
హార్డ్ డిస్కుల నుంచి సేకరించిన వివరాలను తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ అధికారులు న్యాయ స్థానానికి అందజేస్తే అక్కడి నుంచి దర్యాప్తు కోసం సిట్ అధికారులు తీసుకున్నారు. దీని ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అచ్చంగా ఆధార్ డేటాబేస్లో సమాచారమే ఈ హార్డ్డిస్కు లలో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఆధార్ సర్వర్లో ఉన్నట్లుగానే పౌరుల కలర్ ఫొటోలు, ఆధార్ నంబరు, ఎన్రోల్మెంట్ నంబరు, పౌరుని పేరు, తండ్రి/భర్తపేరు, పుట్టిన తేదీ, గ్రామం, మండలం, పిన్కోడ్లతో పాటు ఫోన్ నంబరు వంటి వివరాలు ఐటీ గ్రిడ్ హార్డ్ డిస్కుల్లో ఉన్నట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో వెల్లడైంది. వాస్తవానికి ఐటీ గ్రిడ్లో పోలీసులు తనిఖీ చేసినప్పుడు పౌరుల నలుపు-తెలుపు ఫొటోలు ఉన్నాయి.
హార్డ్ డిస్కుల్లో తొలగించిన డేటాను తిరిగి రాబట్టినప్పుడు వారి కలర్ ఫొటోలు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. మొత్తం 7,82,21,397 మంది పౌరుల వివరాలు ఫోరెన్సిక్ నిపుణులు తమ నివేదికలో పొందుపరిచారు. దీని ప్రకారం ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టిన సిట్ అధికారులు కచ్చితంగా ఈ వివరాలన్నీ ఆధార్ సర్వర్ నుంచే తీసుకున్నట్లు భావిస్తున్నారు.
వీటిని పొందేందుకు ఐటీగ్రిడ్ ప్రతినిధులు ఆధార్ డేటాలోకి చొరబడ్డారా? ఎవరైనా అధికారికంగానే వీరికి అందజేశారా? అన్నదానిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఒకవేళ ఐటీ గ్రిడ్ సంస్థ ఆధార్ వివరాలు చౌర్యం చేస్తే సంబంధింత అధికారుల వైఫల్యం కిందికి వస్తుంది. ఉద్దేశపూర్వకంగా సమాచారం చేరవేసి ఉంటే ఇందులో కుట్ర దాగినట్లు పరిగణిస్తారు. ఈవ్యవహారంలో సహకరించిన అధికారులపై సిట్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
ఏపీ, తెలంగాణాతో పాటు ఇతర రాష్ట్రాల డేటా కూడా డేటా చౌర్యంలో ఉన్నట్లు గుర్తించారు. ఇన్నాళ్లూ సరైన ఆధారాల కోసం ఆగిన సిట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ముందడుగెయ్యనుంది. తప్పించుకు తిరుగుతున్న ఐటీ గ్రిడ్, సీఈఓ, అశోక్ కోసం గాలింపు ముమ్మరమైంది. నాలుగు బృందాలు ఏపీతో పాటు బెంగళూరులో కూడా వెతుకుతున్నాయి.
డేటా చౌర్యం జరిగిందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇవ్వడంతో సిట్ దర్యాప్తు స్పీడు పెంచింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో ముందుకెళ్లడం ద్వారా సేవామిత్ర యాప్లో ఉన్న వివిధ శాఖల సమాచారం ఎలా వచ్చిందన్న విషయంపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ స్కాంలో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే తొలి ముద్దాయిలు వారే అవుతారని తెలుస్తోంది.
మూడేళ్ళ కిందటి ఓటుకు నోటు కేసు, మూడు నెలల కిందటి ఐటీ గ్రిడ్ కేసు, టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్నాయి. పూర్తిగా తెలంగాణ సర్కార్ చేతుల్లోకెళ్లిన ఈ రెండు కేసుల్లో దర్యాప్తు వేగం అందుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. టీడీపీ సేవా మిత్ర యాప్ లో కోట్లాది మంది పౌరుల ఆధార్ వివరాలు వున్నాయన్న అంశంపై ఇప్పటికే యూఏడీఏఐ కూడా దృష్టి పెట్టింది. తెలంగాణ సిట్ కి పోటీగా ఏపీలో సిట్ ఏర్పాటు చేసి ఐటీ గ్రిడ్ కేసులో ఎదురుదాడి షురూ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం.
”నీకూ పోలీసులున్నారు. నాకూ పోలీసులున్నారు” అంటూ ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చిన సీఎం బాబు. ఇప్పుడు ఆపద్ధర్మ సీఎం హోదాకి పరిమితం అయ్యారు. రేపటి రోజున ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా? వుండబోతుందన్న దానిపై ఐటీ గ్రిడ్ కేసు పర్యవసానం ఆధారపడి వుంది. కేసీఆర్ సర్కార్ దూకుడు పెంచితే ఆ మేరకు దీటుగా బదులివ్వాలంటే చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిచి కొనసాగాల్సి ఉంటుంది. లేదంటే కథ వేరే గా వుండొచ్చన్నది ఒక అంచనా!