ఏపీలో గత నెల 11న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ నెల 23న ఫలితాలు వెలువడనుండడంతో అందరిలోనూ గెలుపుపై ఉత్కంఠత నెలకొంది. ఇక మెజార్టీ సర్వేలు, మేథావుల విశ్లేషణల ప్రకారం వైసీపీకి కాస్త ఎక్కువుగా మొగ్గు కనపడుతోంది. వైసీపీ ఎమ్మెల్యే క్యాండెట్లు కూడా ఇప్పటికే తాము అధికారంలోకి వస్తున్నామని సంతోషపడుతుండడంతో పాటు ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయా ? అని లెక్కలు కూడా వేసుకుంటున్నారు. వైసీపీలో మంత్రి పదవులు ఆశిస్తోన్న వారిలో ప్రతి జిల్లా నుంచి 3-4 గురు వరకు ఉన్నారు.
ఆశావాహుల లెక్కలు ఎలా ? ఉన్నా జగన్ అందరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాని విషయం. జగన్ ఇప్పటి వరకు ఓపెన్గా మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస్రెడ్డిలకు మాత్రమే మంత్రి పదవులపై హామీ ఇచ్చారు. ఇక మంత్రి పదవి రేసులో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, ఆళ్ల నాని, తెల్లం బాలరాజు లాంటి వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బీసీ కోటాలో ఓ యంగ్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమే అన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.
పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నడుస్తూ తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్కు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జిల్లా వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అనిల్పై టీడీపీ నుంచి మంత్రి నారాయణ పోటీ చేశారు. ఆర్థికంగా బలవంతుడు అయిన నారాయణ అక్కడ గెలిచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అయినా నారాయణ అంగ, ఆర్థిక బలాన్ని తట్టుకుని రేపు ఫలితాల్లో అనిల్ గెలిచి సంచలనం క్రియేట్ చేయబోతున్నాడంటూ జగన్ నివేదికలో తేలిందట.
ఇక బీసీల్లో బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, యువకుడు కావడంతో పాటు జగన్ను విమర్శించే ప్రత్యర్థులపై తన పంచ్ డైలాగులతో విరుచుకుపడే అనిల్కు మంత్రి పదవి ఖాయమంటున్నారు. ఇక నెల్లూరులో ఏడు నియోజకవర్గాలతో పాటు ఎంపీ సీటు నుంచి కూడా రెడ్డి వర్గం వారే వైసీపీ తరపున ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. వీరి నుంచి ఇద్దరు కనీసం తమకు కేబినెట్ బెర్త్ ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ గెలిచాక అసలు ఎవరికి మంత్రి పదవులు దక్కబోతాయో తెలవాలంటే ముందు ఎన్నికల ఫలితాలు వెలువడాల్సిందే. అప్పటి వరకు వైసీపీలో మంత్రి పదవుల గోల ఆగేలా లేదు.