ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇసుక విధానంపై సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తానని చెప్పిన సూక్తిని చాలా చక్కగా పాటిస్తున్నాడు మన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే ఇసుకలో అవినీతిని అడ్డుకోవడం వల్ల అది సహించలేని కొందరు ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఇసుక స్టాక్యార్డు పాయింట్లు పెంచాలని, ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరద తగ్గగానే రీచ్ల నుంచి ఇసుక వీలైనంత త్వరగా స్టాక్ యార్డులకు చేరేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇసుక మాఫియాను అరికట్టడానికి అవసరమైన సాంకేతిక సహకారం తీసుకోవాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ వెల్లడించారు.
ఇసుక విధానంలో ఏ స్ధాయిలోను అవినీతి ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇసుక రవాణా విషయంలో ఇబ్బందులను అధిగమించామా? అని అధికారులను ప్రశ్నించారు. ఇసుక కొరత ఎక్కడెక్కడ ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలని, అందుకనుగుణంగా నిర్మాణాదారులు ప్లాన్ చేసుకుంటారని చెప్పారు.
అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని సూచించారు. ఫుటేజీని మానిటరింగ్ చేసే వ్యవస్ధ కూడా ఉండాలని అన్నారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని అధికారులకు తెలిపారు వైఎస్ జగన్. కాగా ఈ ఇసుక విషయంపై స్పందించిన అధికారుల వివరణ ఇస్తూ..
వర్షాలు, వరదల కారణంగా ఇసుకను తవ్వడానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని, భారీ వర్షాల కారణంగా రిచ్ ల నుంచి ఇసుకని తీసుకుపోతున్నారని, కేవలం 25 రిచ్ ల నుంచి నుంచి మాత్రమే తీసుకుపోతున్నామని తెలిపారు అధికారులు. కాగా నూతన ఇసుక విధానం సెప్టెంబర్ 5న మొదలైనప్పటి నుంచి మొదటి మూడు రోజులు పర్యవేక్షిస్తే రోజుకు 10 నుంచి 12 వేల మెట్రిక్ టన్నుల ఇసుక డిమాండ్ ఉందని, రవాణా విషయంలో 90 శాతం వరుకు ఇబ్బందులు లేవు అని అధికారులు తెలిపారు.