నిత్యం రద్దీ గా ఉండే రోడ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకుంటున్న బాగ్య నగర వాసులు మంగళవారం కుండపోతగా కురిసిన వానతో ఇబ్బందులు పడుతున్నారు.హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోతగా వర్షం కురిసింది. భారీ వర్షానికి ప్రధాన రహదారులన్ని జల దిగ్బంధం అయ్యాయి.4, 5 అడుగులకు మించి రోడ్ల పై నీరు నిలవడంతో నీటిలో వాహనాలు కదలక వాహన చోదకులు ఇబ్బదులు ఎదుర్కొన్నారు .ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు, ప్రయాణికులు వాహన దారులు అతి కష్టం మీద ఇళ్లకు చేరుకున్నారు.ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో బారి వాహనాలకు కూడా ఇబ్బందులు తలెత్తాయి.
రానున్న 24 గంటల్లో హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తాజా ప్రకటన ప్రజల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఇటు బంజారాహిల్స్ అటు జూబ్లీహిల్స్లోని రహదారులు సైతం జలమయం అయ్యాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. మాదాపూర్లోని ప్రధాన రహదారి, కృష్ణానగర్ పరిసరాలు కూడా 2 గంటలపాటు ఏకధాటిగా కురిసిన వానకు వీధులన్నీ నీళ్లు నిండాయి.
బోయిన్పల్లి చౌరస్తాలో వర్షం కారణంగా ట్రాఫిక్ ఇక్కట్లు .
ఇక లోతట్టు ప్రాంతాలైన క్లాక్టవర్, రాణిగంజ్, మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన జడివానకి రోడ్లన్నీ నీట మునిగాయి.చాల అపార్టుమెంట్లలో గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్లో నీళ్లు నిలిచిపోవడంతో బైక్లు, కార్లు వంటి వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. చివరికి ఎస్పీ రోడ్డు, ఎస్డీ రోడ్డు, ఎంజీ రోడ్డు, ఆర్పీ రోడ్డు వంటి రహదారులపై కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో నగరానికి వచ్చిపోయే ప్రయాణికుల ఇక్కట్లు అన్ని ఇన్ని కావు.
కొన్ని ప్రాంతాల్లో చెట్లు, కొమ్మలు విరిగి పడటంతో జనం మరింతగా ఇబ్బంది పడ్డారు
కుత్బుల్లాపూర్, మెహదీపట్నంలో ని ప్రధాన రహదారులతో పాటు బస్తీలు, కాలనీల రోడ్లన్నీ జలమయమవడంతో జనాలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక గుడిమల్కాపూర్ రోడ్లైతే మూడు అడుగుల మేర నీరు ప్రవహించడంతో నడవడానికి కూడా ఇబ్బంది గా మారాయి. అంతే కాకుండా మేడ్చల్ జిల్లా పరిధిలోని దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల్లో కూడా భారీగా వర్షం కురిసింది.