గత ఎన్నికలలో వైసిపి నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ చేతిలో 1.65 లక్షల ఓట్ల తేడాతో ఓడిన మాగంటి 2000 పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు కుమారులు ఆకస్మికంగా మృతి చెందినా.. మనోధైర్యంతో తిరిగి గత రెండేళ్లుగా రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. పార్టీ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మీటింగ్లకు కూడా తన వంతుగా లక్షల రూపాయల ఖర్చు చేస్తూ ఈ ఎన్నికల్లో ఆఖరిసారి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఇదే తనకు చివరి ఛాన్స్ అని ఇద్దరు కుమారులను కోల్పోయిన తనకు ప్రజాసేవ చేయటం మిన్న అని చెబుతూ వస్తున్నారు.
అయితే తెలుగుదేశం అధిష్టానం బాబు పేరును పరిగణలోకి తీసుకోలేదు. కడప జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు, ఇటు మరో సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్ట మహేష్ కుమార్ కు ఏలూరు పార్లమెంటు సీటు కట్టబెట్టింది. చంద్రబాబు మాగంటిని కనీసం పిలిచి ఏ హామీ ఇవ్వలేదని దీంతో బాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన తెలుగుదేశం పార్టీని వీడేందుకు మానసికంగా సిద్ధమైపోయారని తెలుస్తోంది.
వైసీపీ అధినేత జగన్ సైతం మాగంటికి ఫోన్ చేసి అన్నా పార్టీలోకి రా.. ఏలూరు ఎంపీ సీటుతో పాటు ఫైనాన్ష్ వ్యవహారాలు కూడా నేనే చూసుకుంటాను.. నీకు తగిన గౌరవం ఇస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది. మాగంటి ఫ్యామిలీ కూడా ఇంత అవమానం జరిగాక ఈ పార్టీలో ఉండడం కంటే పార్టీ వీడడమే మేలన్న నిర్ణయానికి వచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన అనుచరులతో మీటింగ్ పెట్టి నిర్ణయానికి రానున్నట్టు టాక్ ? మాగంటి పార్టీని వీడితే ఏలూరు పార్లమెంటు పరిధిలో టీడీపీకి పెను కుదుపే అని చెప్పాలి.