రాయలసీమ అంటే ఫ్యాక్ష‌న్‌, రక్తపాతం, రాజకీయ కక్షల చరిత్రతో ముడిపడి ఉంటుంది. ఎన్నో మార్పులు వచ్చినా, కొన్నిచోట్ల ఇప్పటికీ ఆ తాపత్రయం, ఆ కక్షలు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా – ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే సాగుతుంటాయి. తాడిపత్రిలో జేసీ కుటుంబం వర్సెస్ వైసీపీ పెద్దారెడ్డి పోరు ఉంటే, ధర్మవరం – రాప్తాడు ప్రాంతాల్లో పరిటాల ఫ్యాక్షన్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. పరిటాల రవీంద్ర లెగసీ .. దివంగత పరిటాల రవీంద్ర పేరు రాయలసీమలో ప్రత్యేక గుర్తింపు. ప్రజా ఉద్యమాల నుంచి నక్సల్ మౌలిక స్థాయిలో పని చేసి, తరువాత ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగారు. కానీ ఆయన రాజకీయ జీవితం ఎప్పుడూ రక్తపాతం తోడైందే. ప్రత్యర్ధులతో నిరంతర పోరాటం చేస్తూ చివరికి 2005 జనవరి 25న ఆయన దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ ఘటన రాయలసీమ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద సంచలనం సృష్టించింది.


సునీత – శ్రీరామ్‌ ఎంట్రీ .. రవీంద్ర మరణంతో ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో రాప్తాడు నుంచి గెలిచి మంత్రి పదవీని కూడా చేపట్టారు. ఇదే సమయంలో పరిటాల వారసుడు శ్రీరామ్‌ యువ నేతగా ముందుకు వచ్చారు. అప్పట్లో ఆయనకు ప్రాంతం సున్నితమైనదని గుర్తించి ప్రభుత్వం గన్‌మెన్ ఇచ్చింది. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన భద్రత తొలగించబడింది. ధర్మవరం లో ఫోకస్ .. 2019లో టీడీపీ ఓటమి, వరదాపురం సూరి బీజేపీలోకి మారిపోవడంతో ధర్మవరం బాధ్యతలు శ్రీరాం భుజాలపై పడ్డాయి. ఐదేళ్ల పాటు అక్కడ ఇంచార్జ్‌గా కఠిన పోరాటాలు చేశారు. 2024 ఎన్నికల్లో పొత్తుల కారణంగా ఆ సీటు బీజేపీకి దక్కింది. సత్యకుమార్ యాదవ్ గెలిచి మంత్రిగా ప్రమోషన్ పొందారు. అయినప్పటికీ టీడీపీ, ముఖ్యంగా చంద్రబాబు, ధర్మవరం ఇంచార్జ్‌గా శ్రీరామ్‌ ని కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన అక్కడ వైసీపీకి గట్టి సవాలుగా మారారు.



కోర్టు ఆదేశాలతో భద్రత .. ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు పరిటాల శ్రీరామ్‌ కి మళ్ళీ భద్రత కల్పించబడింది. రాయలసీమ రాజకీయాల్లో "కత్తి మీద సాము" లాంటి పరిస్థితులు ఉండటంతో భద్రత తప్పనిసరి అయింది. పరిటాల కుటుంబ చరిత్రే పోరాటాలతో నిండిపోయినది కాబట్టి శ్రీరాం కి సెక్యూరిటీ రీస్టోర్ కావడం సహజమే.ముందున్న సవాళ్లు .. ఇక భద్రత తిరిగి దక్కించుకున్న తర్వాత శ్రీరాం మరింత దూకుడుతో ధర్మవరం – రాప్తాడు రాజకీయాల్లో అడుగులు వేస్తారని అంటున్నారు. రాయలసీమలో ఫ్యాక్ష‌న్‌ ముద్రని తగ్గించే ప్రయత్నం ఒక వైపు జరుగుతుంటే, పరిటాల వారసుడిగా శ్రీరామ్‌ మరో వైపు రాజకీయాల్లో తనకంటూ స్థానం సంపాదించుకోవాలనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఆయన పోరాటం వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య హాట్ టాపిక్ అవడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: