ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కేలా ఒక కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్బంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తూ, పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ప్రత్యేకంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని, అనంతరం కర్నూలులో కూటమి నేతలతో కలిసి రోడ్‌షోలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రధాన అజెండాగా నిలిచే అవకాశం ఉంది. ప్రధాని మోదీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ కూడా పాల్గొననున్నారు.

రాష్ట్రంలో అధికార కూటమి ఐక్యతను, సమన్వయాన్ని ప్రజలకు బలంగా చాటిచెప్పేందుకు ఈ రోడ్‌షోను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఇప్పటికే శాసనమండలి లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్సీలకు ఈ పర్యటన వివరాలు చెప్పి, తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇటీవల కేంద్రం అమలు చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు నేరుగా లాభం కలుగుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దాదాపు రూ.8 వేల కోట్ల మేర ఆదా అవుతుందని ఆయన అంచనా వేశారు. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, సామాన్య కుటుంబాల వరకు ఈ ప్రయోజనాలు చేరతాయని తెలిపారు. ట్రాక్టర్లు, పాఠ్యపుస్తకాలు, మందులు, చేనేత వస్త్రాలు, బొమ్మలు వంటి అవసరమైన వస్తువులపై జీఎస్టీ తగ్గడం వల్ల ధరలు తగ్గి, కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పారు.

మోదీ పర్యటనలో భాగంగా పలువురు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలను ఈ పర్యటనలో హైలైట్ చేయబోతున్నారు. ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించడం వల్ల ఎగుమతులు పెరుగుతాయని మోదీ, బాబు, పవన్ త్రయం వేదికపై చెప్పే అవకాశముంది. ప్రధాని మోదీ చివరిసారి జూన్ నెలలో విశాఖపట్నంలో జరిగిన వరల్డ్ యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అప్పుడు జీఎస్టీ సంస్కరణలతో మరోసారి రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించేలా పర్యటన ప్రణాళిక సిద్ధమైంది. రాజకీయంగా కూడా ఈ పర్యటన కూటమి శక్తి ప్రదర్శనగా, వైసీపీపై ఒత్తిడి పెంచే అవకాశంగా మారనుంది. మొత్తానికి, అక్టోబర్ 16న జరిగే ప్రధాని మోదీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ చేంజర్‌గా నిలవడం ఖాయం. అభివృద్ధి వాగ్దానాలతో పాటు కూటమి ఏకతాటిపై ఉందనే సందేశం ఇవ్వడానికి ఈ పర్యటన కీలకం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: