తెలంగాణలో టీడీపీ ఒకప్పుడు ఉండేది? అనే పరిస్థితి త్వరలోనే రాబోతోందా? ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఉన్న ముగ్గురు నేతలు తమదారి తాము చూసుకునేందుకు సిద్ధమవుతున్నారా? వీరు కూడా వెళ్లిపోతే ఇక దాదాపు టీటీడీపీ ఖాళీ అయిపోయినట్టేనా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన ముందు వరకూ టీడీపీ తెలంగాణలో అత్యంత బలమైన పార్టీగా ఉండేది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత దారుణంగా దెబ్బతిన్న పార్టీగా తెలుగుదేశం చరిత్రలో నిలిచిపోయింది. అధినేత చంద్రబాబు ఏపీలోనే ఎక్కువగా ఉండటం, ఇక్కడి పార్టీ వ్యవహారాలు పట్టించుకోకపోవడంతో.. నాయకులంతా చెల్లాచెదురైపోయారు. ఇప్పుడు ఉన్న ఆ ముగ్గురు కీలక నేతలు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది!!
తెలంగాణ రాజకీయాల్లో టీటీడీపీది వింత పరిస్థితి. ద్వితీయ శ్రేణి క్యాడర్ ఉన్నా.. నాయకులు తలోదారిలో వ్యవహ రిస్తుండటం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కారు దెబ్బకు సైకిల్ అతలాకుతలం అయిపోతోంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సీఎం కేసీఆర్.. టీడీపీపైనే ఎక్కువగా దృష్టిసారించారు. కీలకమైన నేతలందరినీ ఆపరేషన్ ఆకర్ష్తో కారెక్కించేశారు. దాదాపు సగం మంది నేతలు గులాబీ కండువా కప్పేసుకున్న విషయం తెలిసిందే! ఫైర్ బ్రాండ్ రేవంత్రెడ్డి వంటి నాయకులు ఉండటంతో టీటీడీపీకి తిరుగులేదని భావించారు. కానీ పార్టీలోని అంతర్గత విభేదాలు, టీఆర్ఎస్తో పొత్తు వంటివి.. అంశాలతో నొచ్చుకున్న ఆయన.. కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. దీంతో వాగ్ధాటి, ప్రజల్లోకి చొచ్చుకెళ్లే నాయకులు కనిపించడం లేదు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తెలంగాణ రాజకీయాలపై ఎక్కువ దృష్టిసారించలేకపోతుండటం కూడా టీటీడీపీ నాయకులను ఆలోచనలో పడేస్తోంది. ఇక ఓటుకు నోటు కేసు కూడా దెబ్బతీసింది. దీంతో ఒక్కొక్కరుగా మొదలైన వలసలు.. దాదాపుగా పార్టీ మొత్తం ఖాళీ అయిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రమణ.. వేళ్ల మీద లెక్కేసంత నేతలు మాత్రమే ప్రస్తుతం పార్టీలో మిగిలిన పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు నేతలు లేని వేళ.. ఉన్న కొద్దిమంది నేతలు కూడా సర్దుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. త్వరలో చంద్రబాబు మరో షాక్ తప్పదని తెలుస్తోంది.
పార్టీలో మిగిలిన ఉన్న కొద్దిమంది నేతల్లో ముగ్గురు పేరున్న తమ్ముళ్లు గులాబీ కారు ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పార్టీ ఇమేజ్ అంతకంతకూ తీసికట్లుగా మారుతూ. తెలంగాణలో ఉనికి సమస్యగా మారిన వేళ.. ఇప్పటికీ పార్టీలో కొనసాగితే మునుగుడే తప్ప తేలేది లేదన్న విషయంపై క్లారిటీ రావటంతో ముగ్గురు ముఖ్యనేతలు వెళ్లిపోయేందుకు రెడీ అయినట్లుగా తెలిసింది. వీరి రాకకు కేసీఆర్ సైతం ఓకే చెప్పేసినట్లుగా చెబుతున్నారు. వీరు కూడా వెళిపోతే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఖాళీ కావటం దాదాపుగా ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.