తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. వచ్చేనెలలో తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసూకుంటూ ఉపన్యాసాలు ఇస్తున్నాు. ఇక ఏపిలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇక్కడి నాయకులు కూడా జోరుగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించి సంవత్సరం అవుతుంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’పార్టీ స్థాపించిన పవన్ కళ్యాన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజాపోరాటం సభలు నిర్వహిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా పీ గన్నవరంలో నిన్న రాత్రి జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. ఏపీలో నిర్మితమవుతున్న ప్రతి ప్రాజెక్టులో జగన్ కు కొంత వాటా వెళుతోందని, ఆయనకు చేరాల్సిన వాటా సక్రమంగా చూసే బాధ్యతను స్వయంగా చంద్రబాబునాయుడు పర్యవేక్షిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం పదవి తనకు అలంకారం కాదని, ప్రజలే తన బలమని, జనసేన అధికారంలోకి వస్తే జవాబుదారీ తనాన్ని పెంచుతామని చెప్పారు.
వచ్చే ఐదేళ్లూ చంద్రబాబుకు లేదా జగన్ కు అధికారాన్ని ఇస్తే, గోదావరి నదిలో ఇసుక తిన్నెలు కూడా మాయమైపోతాయని మండిపడ్డారు. జగన్ ఉపన్యాసాలు బాగానే ఇస్తున్నారు కానీ..ముందు జగన్ ను అసెంబ్లీకి వెళ్లమని చెప్పాలని ప్రజలను కోరారు. ఏపీలో లభ్యమవుతున్న గ్యాస్ ను రిలయన్స్ సంస్థ గుజరాత్ కు పట్టుకెళుతోందని, రాష్ట్ర ప్రజలకు వాటా ఇవ్వకుండా ఈ దందాను సాగించుకుంటుంటే, అటు చంద్రబాబుగానీ, ఇటు జగన్ గానీ ధైర్యంగా ప్రశ్నించలేకపోతున్నారని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు.