రెండోసారి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ దూకుడు పెంచేశారు. సుస్థిరమైన మెజారిటీ సాధించడంతో శషభిషలు లేకుండా తాను అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ప్రారంభించేశారు. రెండోసారి టీఆర్ఎస్ గెలిస్తే పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఇప్పుడు కేసీఆర్ దాన్ని అమలు చేస్తున్నారు.
గులాబీ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పట్టాభిషేకం పొందిన యువరాజు కేటీఆర్.. ఇక ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కూడా త్వరలోనే జరిగిపోవచ్చని అంచనా. కేసీఆర్ పూర్తిగా కేంద్ర రాజకీయాలకు వెళ్లిపోవాలన్నది ఆలోచన. బాగానే ఉంది. మరి కేసీఆర్ చేసినట్టు చంద్రబాబు చేయగలడా.. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కేసీఆర్, చంద్రబాబులను పోల్చి చూడటం సాధారమైపోయింది.
2014 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్.. ఏపీలో టీడీపీ గెలిచిన తర్వాత కేటీఆర్ ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి అయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకే చంద్రబాబు కూడా లోకేశ్ను ముందు ఎమ్మెల్సీ చేసి.. ఆ తర్వాత మంత్రిని చేశారు. పోర్టుఫోలియోలు కూడా దాదాపు అవే. కేసీఆర్ క్రమంగా పార్టీపై కేటీఆర్ కు పట్టు వచ్చేలా కీలక బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు కూడా క్రమంగా పార్టీని లోకేశ్ కు అప్పగించి తాను పాలనపై దృష్టి సారించారు.
ఇక ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ కేంద్ర రాజకీయాలపైవే చూస్తున్నారు. కేసీఆర్ కాస్త ముందుగానే సాహసం చేసి ఎన్నికలకు వెళ్లారు. పక్కా ప్లాన్ ప్రకారం ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అనుకున్నట్టే పార్టీ పగ్గాలను సైతం తనయుడు కేటీఆర్ కు అప్పగించేశారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన సాహసం చంద్రబాబు చేయగలరా..?
కేసీఆర్ తరహాలో చేయడం చంద్రబాబుకు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. కేసీఆర్ ఎన్నికల్లో గెలవడం వల్ల అతనిపై ఇప్పుడు ఎలాంటి వత్తిడీ లేదు. జాతీయ రాజకీయాలు అనేవి బోనస్. అందులో సక్సస్ అయినా కాకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు.
కానీ చంద్రబాబు ముందు ఎన్నికల అగ్ని పరీక్ష ఉంది. అందులోనూ చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలు లేవు. ఒక వైపు రాష్ట్ర ఎన్నికలు.. మరో వైపు జాతీయ స్థాయలో కూటమి బాధ్యతలు ఊపిరిసలపనివ్వడం లేదు. ఈ సమయంలో ఇప్పుడు పార్టీని లోకేశ్ అప్పగించే రిస్క్ చంద్రబాబు తీసుకోవచ్చు.
ఒక వేళ ఏపీలో కూడా టీడీపీ తగినంత మెజారిటీతో గెలిస్తే అప్పుడు లోకేశ్ ను ప్రమోట్ చేసే ఆలోచన చేయవచ్చు. అందులోనూ కేటీఆర్ తో పోలిస్తే లోకేశ్ కు అనుభవం తక్కువ. కేటీఆర్ నేరుగా రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. లోకేశ్ ఇంతవరకూ బరిలో దిగలేదు. కేటీఆర్ ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పటికే రెండు సార్లు తనను తాను నిరూపించుకున్నారు.
ఇలాంటి ట్రాక్ రికార్డు నారా లోకేశ్ కు లేదు. ఆయన గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కలేదు. అందుకే మొన్నటి కూకట్ పల్లి ఎన్నికల ప్రచార బాధ్యతలకు కూడా దూరంగా ఉన్నారు. కాబట్టి లోకేశ్ కు ఇంకా అనుభవం రావాల్సి ఉంది. అందుకే చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు లోకేశ్ కు అప్పగించే అవకాశాలు ఇప్పట్లో కనిపించడంలేదు.