వైసీపీలో మరో వికెట్ పడిపోయింది. కాదు. కాదు.. జగనే పడగొట్టాడు. ఇప్పటి వరకు పలు జిల్లాల్లో పార్టీ ఇంచార్జులను ఎడా పెడా మార్చిన జగన్ ఈ విషయంలో తన కర్కశత్వాన్ని చూపిస్తూనే ఉన్నాడు. తనకు అనుకూలంగా ఉండేవారిని ఆయన నియమించుకుంటున్నారు. అంతేతప్ప.. పార్టీకి వీర విధేయులా కాదా? ఇన్నాళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నారు కదా! అనే విషయాన్ని కూడా జగన్ పక్కన పెడుతున్నాడు. ఇలా ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ మార్పులు చేశాడు. ఇక, ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లా అయిన విజయనగరంపైనా జగన్ తన దూకుడు ప్రదర్శించాడు. ఇక్కడ దాదాపు ఆది నుంచి పార్టీకి మద్దతుగా ఉన్ననెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయకర్త పెనుమత్స సాంబశివరాజును జగన్ పక్కన పెట్టారు.
ఇటీవల జగన్ ఇక్కడ పాదయాత్ర చేసిన సమయంలోనూ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు., వాస్తవానికి సాంబశివరాజు.. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. నెల్లిమర్లలో ఎలాంటి వర్గ పోరు లేకుండా కూడా పెనుమత్స జాగ్రత్తలు తీసుకు న్నారు. పార్టీ తరఫున ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా విజయవంతం చేస్తూ.. ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పెనుమత్సను ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించినట్టు తెలియడంతో పార్టీ శ్రేణులు కంగుతిన్నాయి. పెనుమత్స స్థానంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు నెల్లిమర్ల బాధ్యతలు అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
జిల్లా వైసీపీకి తొలి నుంచి అండగా ఉంటున్న పెనుమత్సనే ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో మిగిలిన ఇన్చార్జ్ల్లోనూ ఆందోళన నెలకొంది. ఐదేళ్ల పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర పాలక మండలి సభ్యుడిగా సేవలందించిన పెనుమత్సను చివరకు నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించారన్న సమాచారం ఆయన వర్గీయులను దిగ్బ్రాంతికి గురి చేసింది. 2014 ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పెనుమత్స కుమారుడు సురేష్ బాబు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గ బాధ్యతలను పెనుమత్సకు జగన్ అప్పగించారు. తీరా ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆయన్ను తప్పించడం చర్చనీయాంశ మైంది. ఆర్ధికంగా బలంగా లేకపోవడం కూడా పెనుమత్సను పక్కన పెట్టడానికి ఒక కారణంగా చెబుతున్నారు. మరి ఈప రిణామం వైసీపీకి కలిసి వచ్చే కన్నా కూడా నష్టం చేకూర్చడం ఖాయమని అంటున్నారు.