విజయసాయిరెడ్డి.. వైసీపీలో నెంబర్‌ టూగా చెప్పుకుంటారు. ప్రస్తుతం రాజధాని వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డే చక్కబెడుతున్నాడని చెప్పుకుంటారు. ఇక విజయసాయిరెడ్డికి చంద్రబాబు పై విమర్శలంటే మహా సరదా. అయితే.. ఆ సరదా ఇప్పుడు మరింత జోరందుకుంది. ట్విట్టర్ సాక్షిగా విజయసాయిరెడ్డి రెచ్చిపోతున్నారు. దాదాపు రెండు గంటలకో ట్వీట్ పెడుతూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.


గత 12 గంటలలో ఏకంగా 10కి పైగా ట్వీట్లు పెట్టిన విజయసాయి.. అందులో ఏడు ట్వీట్లు చంద్రబాబుపై విమర్శలకే కేటాయించరు. అనేక అంశాలను ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి చంద్రబాబును చెడుగుడు ఆడుకుంటున్నారని చెప్పొచ్చు. చంద్రబాబు రెండు రోజుల క్రితం కొవిడ్ రోగులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఒక పూట దీక్ష చేశారు. దీనిపై విజయిసాయిరెడ్డి విమర్శిస్తూ.. వరుసగా ట్వీట్లు చేశారు.

ఈ ట్వీట్లతో విజయసాయిరెడ్డి ఏమంటున్నారో చూడండి..

“ అధికారంలోనుండగా చూడవలె బాబు గారి దుబారా. ప్రత్యేక విమానాలు, భారీ సెట్టింగులు, డ్రోన్- క్రేన్ కెమెరాలు. ఢిల్లీలో ఒక్కరోజు  దీక్షకు11 కోట్ల ప్రభుత్వ ధనం తగలెట్టేశాడు. నవనిర్మాణ దీక్షలంటూ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి సాంతం నాకేశాడు. ఇప్పుడు మళ్లీ కొంగ జపాలు మొదలెట్టాడు.


అమరావతికి కూతవేటు దూరంలో  నలుగురు కార్యకర్తలు, 40 మంది పచ్చ మీడియా ప్రతినిధులతో దీక్షాదక్షుడు! ఇంకా క్లారిటీ రాలేదా చంద్రబాబు? కరకట్ట కొంప వెనుక కృష్ణా నదిలో మూడు మునకలేసి రాజకీయ సన్యాసం తీసుకో. చరమాంకంలో ఈ చమక్కులేంటి?


50 ఏళ్ల రాజకీయ అనుభవం, మహారాజునంటాడు. విజయనగరం జిల్లాకు ఒక్క యూనివర్సిటీ తేలేకపోయాడు.50 ఏళ్లు వయసు లేని సీఎం గారు యూనివర్సిటీ ఏర్పాటుచేశారు. అభివృద్ధిని అడ్డుకోవడం, ట్రస్టు భూముల్ని అమ్మేయడం, సమస్యను జఠిలం చేయడంలోనే అశోక్  గజపతుల వారు అర్థ శతాబ్దం బిజీగా గడిపాడు.


శ్రీకృష్ణదేవరాయలు సింహాచలం దేవాలయాన్ని రెండుసార్లు సందర్శించారని ఆలయంలో శాసనాలు చెప్తున్నాయి. స్వామి వారికి ఆయన ఎన్నో అమూల్యమైన ఆభరణాలు సమర్పించారు. పర్వదినాలోనయినా స్వామిని అలంకరించి భక్తుల సందర్శనకు పెట్టావా అశోక్ గజపతి? లేక వాటిని కూడా కుప్పం నాయుడుకు కప్పం కింద  కట్టేశావా?


ఎన్టీఆర్ ఆత్మ తనపై పగబట్టిందనే భయంతో బాబు అనేకసార్లు క్షుద్ర పూజలు చేయించాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. మాలోకం ఓటమికి, తన రాజకీయ పతనానికి ఎన్టీఆర్ శాపమే కారణమని తాంత్రిక పూజలు జరిపించాడు. పదవి కోసం ప్రాణాలు తీయడానికైనా వెనకాడడు. చీకటి కుట్రలు చేస్తాడు.



సిఎంగా 14 ఏళ్లు వెలగబెట్టిన బాబు ఏనాడూ జర్నలిస్టుల సంక్షేమం గురించి పట్టించుకోలేదు. యాజమాన్యాలను మ్యానేజ్ చేస్తే చాలనే ఫిలాసఫీని నమ్ముకున్నాడు. జగన్ గారు 25 వేల మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. వారి కుటుంబాల్లో వెలుగులు నింపే భరోసా ఇచ్చారు.


అధికారం పోయినప్పటి నుంచి చంద్రబాబు ఒడ్డున పడ్డ చేపలా గిలాగిలా కొట్టుకుంటున్నాడు. కోవిడ్ మృతుల సంఖ్య లక్షల్లో ఉంటే బాగుండేదని కోరుకుంటున్నాడు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్లలో జగన్ గారి ముందు చూపును దేశమంతా ప్రశంసిస్తుంటే  ‘ఉత్తుత్తి దీక్ష’లతో పరువు తీసుకున్నాడు బాబు.”

ఇలా సాగిపోయాయి విజయసాయిరెడ్డి ట్వీట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: