ఒక్కసారి సినిమాల్లోకి వచ్చాక కెమెరాకి దూరంగా ఉండడం చాలా కష్టం. ఎంత లాంగ్‌ గ్యాప్‌ వచ్చినా, మనసు అటువైపు లాగుతూనే ఉంటుంది. ప్రామినెంట్‌ రోల్‌ దొరికితే మేకప్‌ వేసుకోవాలని కలలు కంటూనే ఉంటారు. నాటి హీరోయిన్లు చాలామంది ఈ ప్యాషన్‌తోనే కొత్త ఇన్నింగ్సులు మొదలుపెడుతున్నారు.

జెనీలియా పెళ్లి తర్వాత తెలుగు ఇండస్ట్రీకి కంప్లీట్‌గా దూరమైంది. ఫ్యామిలీ లైఫ్‌తో బిజీ అయింది. 'నా ఇష్టం' తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టలేదు. మరాఠి, హిందీ సినిమాల్లో స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇచ్చినా, సౌత్‌ సినిమాల్లో మాత్రం కనిపించలేదు. అయితే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్‌కి వస్తోంది జెనీలియా. గాలి జనార్ధన్‌ కొడుకు కిరీటీ హీరోగా లాంచ్‌ అవుతోన్న తెలుగు, కన్నడ బైలింగ్వల్‌ మూవీతో రీఎంట్రీ ఇస్తోంది హాసిని.

కామ్నా జెఠ్మలానీ 'రణం, బెండు అప్పారావు ఆర్.ఎమ్.పి.' లాంటి సినిమాలతో తెలుగునాట స్టార్డమ్‌ సంపాదించింది. 'సైనికుడు, భాయ్' లాంటి సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్ కూడా చేసింది. ఇక 2014లో బెంగళూరు బిజినెస్‌మెన్ సూరజ్‌ని పెళ్లి చేసుకున్నాక సినిమాలకి దూరమైంది. అయితే ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్లు కావడంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెడుతోంది కామ్నా. తెలుగు, తమిళ్‌లో సినిమాలు చేసేందుకు మేకర్స్‌తో సంప్రదింపులు కూడా జరుపుతోంది.

సొనాలి బింద్రే క్యాన్సర్‌ నుంచి కోలుకున్నాక మళ్లీ కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది సొనాలి. జూ.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతోన్న పాన్‌ ఇండియన్ మూవీలో సొనాలి ఒక కీరోల్‌ ప్లే చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. హోమ్లీ క్యారెక్టర్స్‌తో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది మీరా జాస్మిన్. పెళ్లి తర్వాత సినిమాలకి గ్యాప్‌ ఇచ్చిన మీరా జాస్మిన్, భర్తతో విడిపోయాక మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. మళయాళీ మూవీ 'మకల్'తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసింది. ఇక త్వరలోనే టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.

నైంటీస్‌లో చిరంజీవితో బోల్డన్ని సూపర్ హిట్‌ మూవీస్ చేసిన రాధ, పెళ్లి తర్వాత ఫిల్మ్‌ ఇండస్ట్రీకి దూరమైంది. కూతుళ్లు కార్తీక, తులసి ఇద్దరూ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చినా రాధ మాత్రం సినిమాల వైపు చూడలేదు. అయితే టీవీషోస్‌ మాత్రం చేస్తోంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత తమిళ్లో ఒక రియాలిటీ షోకి జడ్జిగా చేస్తోంది రాధ. ఇక టీవీల వరకు వచ్చిన రాధ, త్వరలోనే సినిమాల్లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా చేసిన ఖుష్బూ 'స్టాలిన్'తో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీ-ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చినా ఇక్కడ వరుసగా సినిమాలు చెయ్యలేదు. కానీ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' తర్వాత బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌కి సైన్ చేస్తోంది. నెక్ట్స్‌ గోపీచంద్, శ్రీవాస్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో ఖుష్బూ ఒక కీ-రోల్‌ ప్లే చేస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: