యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు తప్పని సరిచేస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. జనవరి 8 నుంచి జనవరి 30 వ తేదీ వరకు బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులందరూ సొంత ఖర్చుతో తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలంటూ కేంద్రం మార్గదర్శకాల్లో వెల్లడించింది. ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు సర్టిఫికెట్ తెచ్చుకోవాలని సూచించారు అదికారులు. అలాంటి సర్టిఫికెట్ తెచ్చుకోలేకపోతే భారత్ లో అడుగుపెట్టనీయరు.
యూకేలో కొత్తరకం కరోనా బైటపడినప్పటినుంచి భారత్ అక్కడినుంచి మన దేశానికి రాకపోకలను నిషేధించింది. తొలుత డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై భారత్ నిషేధం విధించింది. కేసులు తగ్గకపోవడం, పరిస్థితి కుదుటపడకపోవడంతో.. నిషేధాన్ని జనవరి 7 వరకు పొడిగించింది. ఈనెల 8నుంచి విమాన ప్రయాణాలు యథావిధిగా మొదలవుతాయి. అయితే వారానికి పరిమితంగా 30 విమానాలు మాత్రమే నడుపుతారు. జనవరి 23 వరకు సర్వీసుల సంఖ్య పరిమితంగానే ఉంటుందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రయాణికుల వద్ద తప్పనిసరిగా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండేలా వైమానిక సిబ్బంది చూసుకోవాలని చెప్పారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు విమానాశ్రయాలలోనే ప్రయాణికులు వేచి ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.