పవన్ ‘జనసేన’ రాబోతున్న ఎన్నికలలో అధికారాన్ని ఎంతవరకు చేచిక్కించుకుంటుంది అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా ‘జనసేన’ వల్ల తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లో ఎవరికి చిల్లు పడుతుంది అన్న విషయమై రాజకీయ వర్గాలలో రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు ప్రత్యేకంగా కేటాయించిన 2+2 గన్ మెన్ల భద్రతా సిబ్బందిని పవన్ వెనక్కి పంపాడు అన్న వార్తలు గుప్పు మంటున్నాయి. నిన్న రాత్రి పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది గుంటూరులో పవన్ నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తనపై దాడి జరిగే అవకాశముందని పవన్ తన ఉపన్యాసంలో చెప్పి అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చాడు.
దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే పవన్ కు సెక్యూరిటీ కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ ఈ సెక్యూరిటీని తిరిగి వెనక్కు పంపడం విషయమై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. ‘జనసేన’ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు పవన్ భద్రత కోసం గన్ మెన్లను ఇచ్చామని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు ఈ సెక్యూరిటీని పవన్ రాజకీయ ఎత్తుగడలు పసిగట్టే నిఘా కోసం వాడుకుంటున్నారు అనే భావనలో ‘జనసేన’ వర్గాలు ఉన్నట్లు టాక్.
పవన్ కు ఇచ్చిన గన్ మెన్ల ద్వారా జనసేన పార్టీ అంతర్గత విషయాలు సమావేశాల వివరాలు తెలుగుదేశం పార్టీలోని కీలక నాయకులకు లీక్ అవుతున్నాయని పవన్ పసికట్టినట్లు సమాచారం. దీనితో ముందు చూపుతో పవన్ ఎలర్ట్ అయి ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బందిని సరెండర్ కావాలని వారికి సూచించిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ తన భవిష్యత్ రాజకీయ సమావేశాలకు ప్రజల ముందుకు వెళ్ళే అన్ని సందర్భాలలోనూ ప్రవేట్ సెక్యూరిటీని ఎక్కువగా ఉపయోగించుకుని తన రాజకీయ ఎత్తుగడల రహస్యాలు లీకు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు గుప్పు మంటున్నాయి.