తెలంగాణా సీఎం కేసీఆర్లో ప్రభుత్వాన్ని రద్దు చేసిన సమయంలో ఉన్న ఊపు, ఉత్సాహం ఇప్పుడు కనీసం కూడా కనిపించడం లేదని అంటున్నా రు విశ్లేషకులు. ఇక్కడ వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు తెరదీశారు. అయితే, అధికారంలోకి తిరిగి తానే రావాలని ఆయన భావించారు. అయితే, ఆయన చాలా గోప్యంగా వ్యవహరించిన ఈ సందర్భంలో కాంగ్రెస్ సహా వివిధ పక్షాలకు సరైన దిశలేకపోవడం గమనార్హం. నిజానికి కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని అనుకున్నా.. ఇప్పుడిప్పుడే చేయరనే ఊహాగానాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాగాయి. కానీ, ఇంతలోనే కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేయడం, వెంటనే మీడియా మీటింగ్ పెట్టడం క్షణాల్లోనే జరిగిపోయాయి. ఈ షాక్ నుంచి ప్రతిపక్ష పార్టీలు తేరుకునేలోగానే కేసీఆర్ మరో అతి పెద్ద షాక్ ఇచ్చారు. దాదాపు వంద మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు.
దీంతో అసలు ఏం చేయాలో కూడా విపక్షాలకు అర్ధం కాలేదు. పైగా.. అభ్యర్థులను కూడా ప్రకటిస్తారని కేసీఆర్ విషయంలో తలపండిన రాజకీయ విశ్లేషకులు కూడా అనుకోలేదు. దీంతో విపక్షాలు ఇక జావగారిపోయినట్టే.. గెలుపు మాత్రం కేసీఆర్దేనని అందరూ అనుకున్నారు. అయితే, అను కున్నది ఒక్కటి రానురాను రాష్ట్రంలో జరుగుతున్నది మరొకటి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహంతో తెలం గాణాలో రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. నిన్న మొన్నటి వరకు అంటీముట్టనట్టుగా ఉన్న కాంగ్రెస్-టీడీపీ-సీపీఐ-ప్రొఫెసర్ కోదండ రాం పార్టీ టీజేఎస్లు ఒక్కతాటిపైకి వచ్చాయి. మహాకూటమిగా ఏర్పడ్డాయి.
కేసీఆర్ను మట్టికరిపించడమే ధ్యేయంగా ముందుకు సాగు తామని ప్రతిజ్ఞ చేశాయి. ఇక, బీజేపీ ఒంటరిపోరు చేయనుంది. దీంతో ప్రభుత్వాన్ని రద్దు చేసే నాటికి ఉన్న ధైర్యం కేసీఆర్లో రానురాను తగ్గుతూ వచ్చింది. ఇదిలావుంటే, తాను ప్రకటించిన 100 సీట్లలో కొందరికి టికెట్లు ఇవ్వలేదు. ముఖ్యంగా సిట్టింగులకు టికెట్ ఇస్తానని ప్రకటించిన కేసీఆర్.. కొందరికి మొండి చేయి చూపించారు. ముఖ్యంగా గెలుపు గుర్రం ఖాయమని భావించే నాయకులకు కూడా తన కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన టికట్లు ఇవ్వలేదనే ప్రచారం కూడా ఉంది. కొండా సురేఖ దంపతులవిషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అదేవిధంగా ఆరోగ్య కారణాలతోనే ఆందోల్ నుంచి నటుడు బాబూ మోహన్ను తప్పించారని అంటున్నా.. ఆయన కేసీఆర్కు దూరంగా ఉండడమే కారణమని, పార్టీ ఫండ్ ఇవ్వడంలో ఆయన ధిక్కరించారనే ప్రచారం కూడా ఉంది.
అదేవిధంగా చాలా మంది నాయకులు టీఆర్ ఎస్ అధినేత తీరుతో విస్మయం వ్యక్తం చేశారు. దీంతో అవకాశం ఉన్నవారు అవకాశం వచ్చినట్టు పార్టీలు మారిపోయారు. దీంతో వీరంతా నిన్న మొన్నటి వరకు కేసీఆర్ను పొగిడిన నోటితోనే వ్యతిరేక ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. ఇక, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని, మంత్రి పదవిని సైతం పోగొట్టుకున్న రాజయ్యకు తిరిగి టికెట్ ఇవ్వడాన్ని కూడా ఓ వర్గం నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ఈ వ్యతిరేక ప్రచారం టీఆర్ ఎస్పై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో? కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.