ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మారుస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం జగన్ ఈ క్రమంలో అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అమ్మ ఒడి పథకంపై ఏపీ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు అందజేస్తామని పేర్కొంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
పేదల పిల్లలు ప్రతీ ఒక్కరు బడికి వెళ్లి చదువుకోవాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని సీఎంఓ పేర్కొంది. బడిబాట కార్యక్రమంలో అక్షరాభ్యాసం సందర్భంగా, విద్యా శాఖ సమీక్ష సమావేశంలో ఈ పథకం గురించిన విధివిధానాలు రూపొందించాలని ఆయన ఆదేశించారని తెలిపింది. ఇందులో భాగంగా ముందుగా ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని పేర్కొంది. పాదయాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అనుసరించి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ముందుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల స్థితిగతుల్ని, రూపు రేఖల్ని మార్చాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు పేర్కొంది.
అమ్మొడి కార్యక్రమంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావు లేదని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి ఈ పథకం వర్తిస్తుందని సీఎంఓ స్పష్టం చేసింది. ‘దేశం మొత్తంలో నిరక్షరాస్యుల సగటు 26 ఉంటే.. ఏపీలో 33 శాతం ఉంది. మన రాష్ట్రంలో ప్రతీ 100 మందిలో 33 మంది నిరక్షరాస్యులే. అక్షరాస్యత విషయంలో ఏపీ దేశంలో అట్టడుగున ఉంది. ఈ పరిస్థితిని మార్చి.. పేద కుటుంబాల్లోని పిల్లలు చదువుకునే విధంగా ఈ పథకాన్ని ప్రకటించారు’ అని ‘అమ్మ ఒడి’ పథకం ఆవశ్యకతను వివరించింది.