హైదరాబాద్ పంజగుట్టలో బస్సులో చోటుచేసుకున్న కాల్పుల ఘటన సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రయాణికులతో వాగ్వాదం పెట్టుకున్న సఫారి దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి బస్సులో కాల్పులు జరిపాడు. బుల్లెట్లు బస్సు రూఫ్ టాప్ నుంచి గాల్లోకి దూసుకెళ్లాయి. దీనిపై టాస్క్ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్ వాంగ్మూలంను రికార్డు చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తికోసం సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. ఇందులో ఏపీ కానిస్టేబుల్ ఒకరు నిందితుడిగా గుర్తించారు. ఈ దర్యాప్తులో మరిన్ని ఆసక్తికర అంశాలు తెరమీదకు వచ్చాయి.
కాల్పులు జరిపిన వ్యక్తి ఏపీ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్గా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. అనంతరం ఇదే విషయాన్ని ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై స్పందించిన ఏపీ డీజీపీ ఠాకూర్ జనాల మధ్యలో ఫైర్ ఓపెన్ చేయడం తీవ్రమైన నేరమన్నారు. హైదరాబాద్ పోలీసులు శ్రీనివాస్కు సంబంధించిన కేసుపై సమాచారం ఇచ్చారని.. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. అయితే, పని ఒత్తిడి వల్లే ఇలా ఆయన కాల్పులకు తెగబడ్డట్లు ప్రచారం జరిగింది. దీనిపై డీజీపీ ఠాకూర్ స్పందిస్తూ, ఇక డిపార్ట్మెంట్లో ఎలాంటి పని ఒత్తిడి లేదని తెలిపారు.
ఇదిలాఉండగా, కాల్పులు జరిపిన శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ను కూకట్పల్లిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదువులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్న శ్రీనివాస్గా నిర్ధారించారు. ఓ ప్రముఖుడి దగ్గర సెక్యూరిటీగా పనిచేస్తున్న శ్రీనివాస్.. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో బస్సులో ఉన్న తోటి ప్రయాణికులను బెదిరించేందుకే కాల్పులు జరిపినట్టుగా భావిస్తున్నారు.