ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ సభ్యులు ఎవరికి వారే తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నించారు. విపక్షం టీడీపీని ఎండగట్టేందుకు సభ్యులు ఎవరికి వారు తమ తమ ప్రయత్నాల్లో మాటల యుద్ధానికి తెరదీశారు. టీడీపీ నేతలపై విమర్శ ల వర్షం కురిపించారు. అయితే, ఇలా టీడీపీపై విమర్శలు చేసిన వారంతా దాదాపు వైసీపీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీ లోనే ఉన్నవారు కావడం గమనార్హం. అయితే, ఒకే ఒక్కరు మాత్రం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వరకు టీడీపీలోనే ఉండి, అప్పటి వరకు టీడీపీ ఎంపీగా ఢిల్లీలో చక్రం తిప్పి, చంద్రబాబు కనుసన్నల్లో పాలిటిక్స్ చేశారు. ఆయనే అవంతి శ్రీనివాస్.
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ విషయంలో రేగిన విభేదాల కారణంగా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే ఆయన టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ టికెట్పై అక్కడే పోటీ చేసి టీడీపీ నుంచి పోటీ చేసిన సబ్బం హరిని ఓడించారు. ఆ వెంటనే జగన్ నేతృత్వంలోని కేబినెట్లోనూ అవంతి బెర్త్ సంపాయించుకు న్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల చివరి రోజు మంగళవారం సభలో అవంతి తనకంటూ ప్రత్యేకతను చాటుకు న్నారు.
ప్రత్యేకహోదాపై తొలి సభ చివరిరోజు ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టింది. దీనికి సంబందించి సభ్యులు ప్రసంగించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి, సభలో ప్రతిపక్ష ఉప నేత అచ్చన్నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో అడుగడుగునా అవంతి కౌంటర్లు ఇచ్చారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కేంద్రం ఏపీకి హోదా ఇచ్చది లేదని, విశాఖ రైల్వేజోన్ ఇచ్చేది లేదని ప్రకటించినప్పుడు తన పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబు వద్ద ప్రతిపాదించానని , అయితే, దీనికి ఆయన తిరస్కరించి, ఆందోళన చేయాలని మాత్రమే సూచించారని, నువ్వు వైసీపీ వలలో చిక్కుకున్నావా? అంటూ ఆడిపోసుకున్నారని అవంతి వెల్లడించారు.
మరో సందర్భంలో తాను నిరాహార దీక్షకు కూర్చున్నప్పుడు సీఎంవో నుంచి ఫోన్లపై ఫోన్లు చేయించారని, అదేవిధంగా ఢిల్లీ నుంచి సుజనా చౌదరితోనూ ఫోన్ చేయించి తిట్టించారని వెల్లడించారు. టీడీపీకి హోదాపై నమ్మకం లేదని, కేంద్రం ఇచ్చే ప్యాకేజీనే కోరుకుందని ఇది తాను ఎంపీగా బాగా గుర్తించానని చెప్పిన అవంతి.. సభలో టీడీపీ నేతలకు మాటలు రాకుండా చేశారు. దీంతో వైసీపీకి మరింత జోష్ పెరిగింది.