భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా మూడుసార్లు ఐసిసి ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్గా ఇప్పటికీ మహేంద్రసింగ్ ధోని కొనసాగుతూ ఉన్నాడు. అంతేకాదు వన్డే, టీ20 టెస్ట్ ఫార్మట్ లలో కూడా ఐసిసి ట్రోఫీలను జట్టుకు అందించాడు ధోని. ఐపీఎల్ లోను తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేసి నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ని నిలిపాడు. కాగా ఇటీవలే ధోనీతో ఆడిన అనుభవం గురించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డూప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ధోనితో ఆడిన అనుభవం ప్రస్తుతం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ధోని సారథ్యంలోనే 2011 నుంచి 15 వరకు, ఆ తర్వాత 2018 నుంచి 2021 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడాడు డూప్లేసెస్.
నేను సారధిగా వ్యవహరించిన కాలంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే నేను ఆడిన కెప్టెన్ల మార్గంలో నేను వెళ్లకపోవడమే. నేను ఎంతో మంది కెప్టెన్సీలో ఆడినప్పటికీ వాళ్ల వ్యూహాలను మాత్రం ఫాలో కాలేదు. వ్యక్తిగతంగా చూసుకుంటే అదే అత్యుత్తమం అని నాకనిపించింది. నేనలా వెళ్ళకపోతే అభిమానులు ఇతరులతో పోల్చి చూస్తారు. అప్పుడు ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. నేను చెన్నై సూపర్ కింగ్స్ తో ఉన్నప్పుడు చాలా సమయం మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తో గడిపాను. ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసేవాడిని.. ఇక ధోని కెప్టెన్సీ చూసిన తర్వాత అద్భుతం అనిపించింది. అతను ఒక గొప్ప వ్యూహకర్త అంటూ డూప్లెసెస్ చెప్పుకొచ్చాడు.