తెలంగాణలో దళిత బంధును సమర్ధవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రతి దళితుడిని ఆదుకోడానికి మొదటి పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ను ఎంపిక చేసింది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు జడివానలా కురిశాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద చేర్చి విమర్శకుల నోళ్లకు తాళాలు వేశారు. తాజాగా దళిత బంధు అమలుపై ముఖ్యమంత్రి సోమవారం ప్రగతి భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు.
హుజురాబాద్ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు మండలాల్లో దళిత బంధు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహబూబ్నగర్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలకు దళిత బంధు వర్తింపజేయాలని ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. పథకం అమల్లో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు, వాటి పరిష్కారాల కోసం అనుభవమున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్తో అనుభవాలను సమావేశానికి హాజరైనవారందరికీ చెప్పించారు.